Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల మరణాలన్ని ప్రభుత్వ హత్యలే : మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
- రైతులకు సంఘీభవం తెలిపిన నేతలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన చేస్తుంటే మోడీ సర్కార్ కు చీమ కుట్టినట్టు కూడా లేదని రైతు, ఉపాధ్యాయ, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు విమర్శించారు. ఢిల్లీ-హర్యానా సరిహద్దు సింఘూలో ఆందోళన చేస్తున్న రైతులకు ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం స్థానిక ఏపి, తెలంగాణ భవన్ లో సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలు తెచ్చిందనీ, వ్యవసాయ చట్టాల వల్ల నష్టపోతామని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో 54 రోజులుగా రైతులు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఉద్యమంలో 122 మంది మృతి చెందారనీ, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే నని పేర్కొన్నారు. చట్టాల అమలుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాత్కాలిక స్టే సమస్యకు పరిష్కారం కాదని, సుప్రీం కోర్టు వేసిన కమిటీని సైతం రైతులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతు పోరాటం ఇంతటితో ఆగదనీ, తెలంగాణ ఇందిరా పార్కులో పెద్ద నిరసన చేపడతామని చెప్పారు.
చట్టాల విషయంలో కేసీఆర్ పునరాలోచించుకోవాలని సూచించారు. రైతులకు అనుకూలంగా కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలని, తెలంగాణా అసెంబ్లీలో వ్యవసాయ చట్టలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు వ్యవసాయం చేయకుండా లాక్ డౌన్ విధించే యోచనలో ఉన్నారని, మోడీ ప్రభుత్వం వెంటనే వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, లేకపోతే రైతులే మోడీ ప్రభుత్వాన్ని బొంద పెడతారని హెచ్చరించారు.
రైతులకే కాదు దేశ ప్రజలకే నష్టం: నర్సిరెడ్డి
ఈ మూడు చట్టాలు కేవలం రైతులకే కాదు, యావత్ భారత ప్రజలకు నష్టం చేసేలా ఉన్నాయని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. విద్యుత్ బిల్లు పార్లమెంటులో పెట్టమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో శాంతి నెలకొల్పేలా మోడీ వ్యవహరించాలని హితవు పలికారు. తెలంగాణ శాసన మండలిలో చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసేలా కృషి చేస్తానని అన్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తీరు ఆందోళనకరం: బి.వెంకట్
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశానికి జరుగుతున్న అన్యాయం పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆందోళనగా ఉందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ విమర్శించారు.
ఒకప్పుడు ప్రజలకు అన్యాయం జరిగినపుడు తెలుగు ప్రజలు ముందున్నారని, ముఖ్యమంత్రుల వైఖరి రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించేలా ఉందన్నారు. తెలుగు ప్రజలు చరిత్రను సృష్టించారనీ, తెలుగు ప్రజల గౌరవానికి అపఖ్యాతి తేవద్దని హితవు పలికారు. దేశం అంతా రైతు ఉద్యమం తో కదులుతుందనీ, తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. జనవరి 23న ఏపీలో చలో రాజధాని కార్యక్రమం జరగనుందని, జనవరి 26న తెలంగాణలో చలో రాజ్ భవన్ కార్యక్రమం జరుగుతుందనీ అన్నారు. ఢిల్లీలో జనవరి 26న ట్రాక్టర్ మార్చ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.