Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా కిసాన్ మహిళా దివస్
- దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో కార్యక్రమం
- మహిళల నేతృత్వంలో ఆందోళన
- ప్రధాని మోడీకి రైతు నేతల లేఖ
- 54వ రోజు కొనసాగిన అందోళన
- అపూర్వ ట్రాక్టర్ల పరేడ్ జరిగితీరుతుంది : ఏఐకేఎస్సీసీ
- 20న మరోసారి చర్చలు
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మహిళా రైతులు నినదిస్తున్నారు. మహిళా రైతు దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు. నిరాహార దీక్షల్లో కూడా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో మహిళ కిసాన్ దివస్ జరిగింది. సుప్రీంకోర్టులో మహిళల భాగస్వామ్యం పట్ల ప్రతికూల వ్యాఖ్యలతో విసుగు చెందిన మహిళా రైతుల బృందం గుజరాత్, మహారాష్ట్ర నుంచి షాజహాన్పూర్కు బయలుదేరింది. మహారాష్ట్ర, గుజరాత్ నుంచి వేలాది మంది మహిళలు షాజహన్పూర్ చేరుకుని, ఆందోళనలో చేరారు. సరిహద్దుకు సమీపంలోని మహిళలు ట్రాక్టర్ మార్చ్ ద్వారా ఉద్యమంలో పాల్గొన్నారు.
మహిళా రైతు దినోత్సవం సందర్భంగా షాజహన్పూర్ వద్ద మహి ళల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, వీధి నాటకాలు, ప్రసంగాలు జరిగాయి. అధ్యక్ష వర్గంలో ప్రతిభా షిండే, చంద్రకాల, నిషా, రాజ్బాలా, వర్షా దేశ్పాండే ఉన్నారు. వక్తలలో రుక్మణి, వర్షాచోప్రా, సుమిత్రాచోప్రా, కవిత శ్రీవాస్తవ, సునీతా చతుర్వేది, ప్రతిభా షిండే, రైజాబాయి, మంజుయాదవ్ ఉన్నారు. ఉద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని వక్తలు పిలుపునిచ్చారు. వ్యవసాయంలోనూ, ఉద్యమంలోనూ మహిళల ప్రత్యేక స్థానం దృష్ట్యా సంయుక్త కిసాన్ మోర్చా జనవరి 18న మహిళా రైతు దినోత్సవంగా జరుపుకుంటామని ప్రకటించింది. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతున్నది. కొత్తగా అనేక మంది రైతులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన సోమవారం నాటికి 54వ రోజుకు చేరుకుంది.
పదో విడత చర్చలు 20న
రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి నేడు (బుధవారం) మరోసారి చర్చలు జరగనున్నాయి. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేదు. రైతు నేతలు, ప్రభుత్వం ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పదోసారి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన భవన్లో మరోసారి చర్చలు జరగనున్నాయి. రైతు నేతలు తమ డిమాండ్లపై స్పష్టంగా ఉన్నారు.
అపూర్వ పరేడ్ జరిగితీరుతుంది: ఏఐకేఏస్సీసీ
అపూర్వమైన కిసాన్ రిపబ్లిక్ పరేడ్ ఢిల్లీలో జరిగితీరుతుందని ఏఐకేఏస్సీసీ తెలిపింది. చాలా జిల్లాలు వేలాది మందిని సమీకరించడంతో ప్రపంచంలోని ఏ దేశంలోని రైతులు తాము ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటివరకు చేయని అతిపెద్ద నిరసన అని పేర్కొంది. చట్టాలు ఉపసంహరించుకునే వరకు ఉద్యమం విస్తరిస్తూ, తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది.
మోడీకి రైతు నేతల లేఖ
మహిళా కిసాన్ దివస్ సందర్భంగా ప్రధాని మోడీకి రైతు నేతలు లేఖ రాశారు. దేశంలో వ్యవసాయ రంగంలో 75 శాతం వ్యవసాయ పనులు స్త్రీలే చేస్తున్నారని గుర్తుచేశారు. రైతు వ్యతిరేక చట్టాలు మహిళా రైతులపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఈ సందర్భంగా రైతు నేతలు పలు డిమాండ్లను ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 60 ఏండ్లు పైబడిన మహిళా రైతులకు నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ ఇవ్వాలని, వారి భౌతిక సామర్థ్యానికి అనుగుణంగా తక్కువ ధరలో వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. మహిళా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రాయితీతో ఇవ్వాలని, కూరగాయలు, పండ్లు, మహిళా రైతులు ఉత్పత్తి చేసే పాలను మద్దతు ధర వద్ద ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి ఉచిత వాహన సదుపాయాలు కల్పించాలని, భూమిలేని మహిళా రైతులకు కనీసం ఒక హెక్టార్ ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆవులు, గేదెలు, మేకలను మహిళా రైతులకు ఉచితంగా అందించాలని అన్నారు. మహిళా రైతుల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని, వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు అందుబాటులో ఉంచాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల మహిళలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.