Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్లో విలయతాండవం చేసిన కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులుగా కొత్తగా వెలుగులోకి వస్తున్న కేసుల సంఖ్య సైతం భారీగా తగ్గింది. మంగళవారం నాటికి గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గి 10,064 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులు ఏడు నెలల కనిష్టానికి చేరాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,81,837కు చేరగా.. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా 137 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా మృతుల సంఖ్య 1,52,556కు చేరింది. కరోనా నుంచి ఇప్పటి వరకు 1,02,28,753 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 17,411 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,00,528 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక రోజువారీ మరణాలు 8 నెలల గరిష్టానికి పడిపోయాయి. మరణాల రేటు 1.44 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయానికి 3,81,305 మందికి వ్యాక్సిన్ అందించారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 25 రాష్ట్రాల్లో 1,48,266 మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపింది.