Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్డినెన్స్ను ఉపసంహరించాలి: ఐలూ డిమాండ్
న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన మతపరమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, విశ్వాసం, మానవ హక్కులు, వ్యక్తుల గోప్యత వంటి నిబంధనలన్నింటినీ ఉల్లంఘించేలా మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిరంకుశమైన ఆర్డినెన్స్ - మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రెలీజియన్ ఆర్డినెన్స్, 2020-ను ఇటీవల తీసుకొచ్చింది. పేరులో మత స్వేచ్ఛ ఉన్నా, అందుకు విరుద్ధంగా ఆర్డినెన్స్ వుంది. గతంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి ఆర్డినెన్స్ తీసుకురాగా, ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ అడుగుజాడల్లోనే నడుస్తోందని అఖిల భారత లాయర్ల యూనియన్ (ఎఐఎల్యు) విమర్శించింది. వివాహం కోసం లేదా వివాహం వల్ల మతపరమైన మార్పిడి జరిగితే ఈ ఆర్డినెన్స్ దాన్ని నేరంగా పరిగణిస్తోంది. రెండు భిన్న మతాలకు చెందిన పెళ్లిళ్లను కూడా రద్దు చేయాలని పేర్కొంటోంది. వివిధ రకాల మత మార్పిడులకు ఈ ఆర్డినెన్స్ కింద ఏడాది నుండి పదేళ్లపాటు జైలుశిక్ష ఉంటుంది. ఏ విశ్వాసాలను నమ్మాలి, మతాన్ని అనుసరించాలి, వివాహం ద్వారా భాగస్వామిని ఎన్నుకోవడం వంటివి రాజ్యాంగంలోని 21వ అధికరణం కింద ఒక వ్యక్తి వ్యక్తిత్వం, గుర్తింపులో భాగంగా వుంటాయి. ఈ ఆర్డినెన్స్ వాటన్నింటినీ నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తోంది. ప్రేమ, విశ్వాసాలను, మానవ సంబంధాలను, వివాహాలను ఈ ఆర్డినెన్స్ నిలువరిస్తోంది. అటువంటి జంటలపై వేధింపులను ప్రోత్సహిస్తోంది. ఇటువంటి నిరంకుశమైన ఆర్డినెన్స్ను తీవ్రంగా నిరసిస్తూ, తక్షణమే దీన్ని ఉపసంహరించుకోవాలని ఎఐఎల్యు డిమాండ్ చేసింది. మతాంతర వివాహాలను దెబ్బతీస్తూ, దాన్ని నేరపూరితమైన చర్యగా పరిగణిస్తూ మానవ సంబంధాలను దెబ్బతీసేందుకు ఈ చర్య చేపట్టారని ఎఐఎల్యు నేతలు ఒక ప్రకటనలో విమర్శించారు.