Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలహాబాద్ హై కోర్టు
లక్నో: విడాకులు ఇవ్వకుండానే మరో బంధంలో కొనసాగడం చట్టపరంగా నేరమనీ, ఇది శిక్షార్హమని ఓ కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. వివరాల్లోకెళ్తే.. ఆషా దేవీ, సూరజ్ కుమార్ల జంట ఇటీవల అలహాబాద్ హైకోర్టులో ఓ పటిషన్ను దాఖలు చేసింది. తామిద్దరం కలిసుండాలని నిర్ణయించుకున్నామనీ, తమపై ఎవరూ ఎటువంటి కేసులు పెట్టకుండా, మేజర్లమైనందున తమకు రక్షణ కల్పించాలని పిటిషన్లో పేర్కొన్నారు.
తాజాగా ఈ కేసును విచారించిన అలహాబాద్ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ''పటిషన్ దాఖలు చేసిన జంటలో ఆశాదేవికి గతంలోనే పెండ్లి అయి మహేష్ చంద్ర అనే భర్త ఉన్నాడు. ఆమె అతనికి విడాకులు ఇవ్వకుండానే సూరజ్ అనే వ్యక్తితో కలిసి ఉండటం చట్టపరంగా న్యాయం ఎలా అవుతుంది'' అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో పిటిషనర్ రక్షణ కోరడానికి అర్హులు కాదనీ, న్యాయస్థానం నుంచి వారికి ఈ మేరకు ఎలాంటి రక్షణ లభించదని న్యాయమూర్తులు ఎస్పీ కీసర్వాణీ, వైకె.శ్రీవాత్సవలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అలాగే, ఆశాదేవీ ఇప్పటికీ చట్టపరంగా మహేశ్ చంద్రకు భార్యేననీ, పెండ్లయి ఒక బంధంలో ఉండగా, జీవిత భాగస్వామిని కాకుండా మరో పెళ్లి చేసుకోవడం చట్టపరంగా నేరమేననీ, సెక్షన్ 494 కింద ఆశాదేవి శిక్షార్హురాలని కోర్టు పేర్కొంది. ఇప్పటికైనా ఆశాదేవి తన తప్పేంటో గ్రహించి భర్త వద్దకు వెళ్లడమో, లేక చట్టపరంగా విడాకులు తీసుకోవడమో చేయాలని సూచిస్తూ.. పిటిషన్ను కొట్టివేసింది.