Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రి మంకుపట్టు వీడాలి : సీపీఐ
- 'అమరావతి' కోసం బీజేపీ, వైసీపీలతో పోరాడాలి : సీపీఐ(ఎం)
తుళ్లూరు : అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తోన్న ఆందోళన బుధవారం నాటికి 400వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజధాని గ్రామాల రైతులు రాజధాని గ్రామాల్లో 'అమరావతి సంకల్ప యాత్ర' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరులో ప్రారంభమైన ర్యాలీ మందడం వరకు కొనసాగింది. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ, ఎంపీ గల్లా జయదేవ్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబురావు, రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం.రవి, సీపీఐ నాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్, రైతు, దళిత, మహిళ జెఎసి నాయకులు రైతులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. తుళ్లూరులో కె.రామకృష్ణ మాట్లాడుతూ ఐదు కోట్ల మంది ప్రజలు అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంకుపట్టు వీడాలని డిమాండ్ చేశారు. బాబూరావు మాట్లాడుతూ అమరావతి పరిరక్షణకు బీజేపీ, వైెసీపీలతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో 50 రోజులకుపైగా ఉద్యమిస్తోన్న రైతుల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, అమరావతి రైతుల ఉద్యమం పట్ల వైసిపి ప్రభుత్వం తీరు కూడా అదే మాదిరిగా ఉందని తెలిపారు. మందడంలో కాంగ్రెస్ నాయకులు ఎన్.తులసిరెడ్డి మాట్లాడుతూ మడమ తిప్పను.. మాట తప్పను అని చెప్పిన ముఖ్యమంత్రి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ మాట్లాడుతూ రాజధానిలో భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం నిన్నటి వరకు చెప్పిన మాటలు హైకోర్టు తీర్పుతో అసత్యమని తేలిందన్నారు.