Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ గ్రూపునకు కట్టబెట్టిన కేంద్రంపై కేరళ సీఎం ఆగ్రహం
తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురం ఏయిర్పోర్టును అదానీ గ్రూపునకు కట్టబెట్టిన కేంద్రం తీరును ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయం విమర్శించారు. రెండు రోజుల క్రితం ఏయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఒప్పందం మీద సంతకం చేసి విమానాశ్రయాన్ని అదానీ గ్రూపునకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అప్పీలు పిటిషన్ను ఏ మాత్రం పట్టించుకోకుండా విమానాశ్రయాన్ని అదానీకి కేంద్రం అప్పజెప్పిందని ఆయన అన్నారు. '' ఇది తీవ్ర ఉల్లంఘన. దేశంలో విమానాశ్రయాలపై అదానీ గ్రూపు గుత్తాధిపత్యం చేస్తుందనడానికి ఇది స్పష్టమైన సంకేతం. ఒకవేళ అదానీ గ్రూపు చేతిలోకి ఈ విమానాశ్రయం వెళ్తే అక్కడ ప్రస్తుతమున్న స్థితి నుంచి ఒక్క ఇంచు అభివృద్ధి కూడా ముందుకెళ్లదు. ఈ ఏయిర్పోర్టు పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలని రాష్ట్రం కోరుకుంటున్నది'' అని రాష్ట్ర అసెంబ్లీలో విజయన్ తెలిపారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ఏయిర్పోర్టు ప్రయివేటీకరణను సమర్థిస్తున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పేరును లేవనెత్తుతూ ప్రతిపక్ష యూడీఎఫ్ తీరును విజయన్ విమర్శించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయగలుగుతుందని చెప్పారు. అయితే కేంద్రం మాత్రం ఏకపక్షంగా ఏయిర్పోర్టును అదానీకి కట్టబెట్టిందని విజయన్ అన్నారు.