Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది 'ప్రత్యేక స్నేహాన్ని' ప్రతిబింబిస్తున్నది: జైశంకర్
- శిక్షణ రెండు వ్యాక్సిన్లు సురక్షితమే..
- శిక్షణ మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో ఉన్న సహకార ఒప్పందంలో భాగంగా ఆరు దేశాలకు భారత్ బుధవారం నుంచి టీకాల సరఫరా ప్రారంభించింది. సీరమ్ సంస్థ తయారు చేసిన కోవిషీల్డ్ టీకాలను తాజాగా భూటాన్కు ఎగుమతి చేసింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 1.5లక్షల డోసులను థింపు నగరానికి పంపించింది.
అలాగే, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్ దేశాలకు కూడా వ్యాక్సిన్లను సరఫరా చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. శ్రీలంక, అఫ్ఘానిస్తాన్, మారిషస్ దేశాల నుంచి ఎంత అవసరమో ధ్రువీకరణ ఇంకా రాలేదన్న విదేశాంగ శాఖ.. వచ్చిన వెంటనే దానికి అనుగుణంగా వ్యాక్సిన్లు అందించనున్నట్టు తెలిపింది. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ..''ఇప్పటికే భూటాన్, మాల్దీవులకు కరోనా టీకాలు పంపించాం. పోరుగు దేశాలకు వ్యాక్సిన్ల పంపకం మా ప్రత్యేక స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది'' అని అన్నారు.
ఇదిలా ఉండగా, దేశంలో కరోనా టీకాల పంపిణీలో భాగంగా ప్రజలకు అందిస్తున్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు కరోనా టీకాలు సురక్షితమైనవేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. నిటి అయోగ్ సభ్యులు డాక్టర్ వికె.పాల్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రెండు వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని అన్నారు. కొందరు టీకాను తీసుకోవడానికి నిరాకరించడం బాధాకరమని తెలిపారు. ఈ రెండు టీకాలు రోగ నిరోధక శక్తిని కలిగి ఉన్నాయి. వీటిని తీసుకోవడానికి భయపడకుండా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్
ట్రయల్స్కు సిఫారసు
కరోనా పోరులో భాగంగా భారత్ బయోటెక్ అభివద్ధి చేసిన ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్కు అనుమతి ఇవ్వాలని భారత డ్రగ్ రెగ్యులేటర్కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) నిపుణుల ప్యానెల్ సిఫారు చేసిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి కోరుతూ హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవల దరఖాస్తు చేసింది. తాజాగా దరఖాస్తులను పరిశీలించిన సబ్జెక్ట్ నిపుణుల కమిటీ.. తొలి విడత ట్రయల్స్కు సిఫారసు చేసింది.
మొదటి క్లినికల్ ట్రయల్స్ భద్రత, ఇమ్యునోజెనిసిటీ డేటా ఆధారంగా రెండో దశ క్లినికల్ ట్రయల్స్కు అనుమతి ఇవ్వనున్నామనీ, ముక్కుద్వారా అందించే ఈ టీకా అందుబాటులోకి వస్తే కరోనా పోరులో గేమ్ చేంజర్గా మారుతుందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
గడ్డకట్టిన 1000 డోసుల కోవిషీల్డ్ !
అసోంలోని సిల్చార్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో స్టోరేజ్ చేసిన సుమారు 1,000 డోసుల 'కోవిషీల్డ్' వ్యాక్సిన్ గడ్డకట్టుకుపోయింది. బరాక్ వ్యాలీ ప్రాంతంలో అత్యాధునిక వైద్య సదుపాయాలున్న సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి (ఎస్ఎంసీహెచ్)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వ్యాక్సిన్ను జీరో టెంపరేచర్లో ఉంచడం వల్లే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. సమాచారం బయటకు రాగానే దీనిపై విచారణకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. గడ్డకట్టుకుపోయిన వ్యాక్సిన్ సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ల్యాబ్కు పంపారు. కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్లయిన కోవిషీల్డ్, కొవాగ్జిన్లను 2-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య నిల్వ చేయాల్సిన సంగతి తెలిసిందే.
దేశంలో కొత్తగా 13,823 పాజిటివ్ కేసులు
బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం... గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,823 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 162 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,52,718కి పెరిగింది. పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,95,660కి చేరింది. ప్రస్తుతం 1,97,201 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత క్రీయాశీలక కేసులు 2 లక్షల కంటే తక్కువకు చేరాయి. ఇప్పటివరకు మొత్తం 1,02,45,741 మంది కరోనా నుంచి కోలుకున్నారు.