Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో మహిళా రైతుల ఆందోళనలు
- ముంబయిలో ఈ నెల 24-26 తేదీల్లో నిరసనలు
ముంబయి : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటానికి మహారాష్ట్రలోని మహిళా రైతులు పెద్ద సంఖ్యలో కదలివస్తున్నారు. తొలుత ముంబయిలో ప్రారంభమైన మహిళా రైతు నిరసనలు క్రమక్రమంగా రాష్ట్రమంతా విస్తరిస్తున్నాయి. వందకు పైగా సంస్థలతో సంయుక్తంగా ఏర్పడిన 'సంయుక్త శేత్కరి కాంగర్ మోర్చ' బ్యానర్ కింద రాష్ట్రవ్యాప్తంగా మహిళా రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఆందోళనల్లో పాల్గొనటమే కాకుండా, మిగిలిన మహిళలకు రైతు చట్టాలతో వచ్చే నష్టాల గురించి ప్రచారం చేస్తూ, అవగాహన కల్పిస్తున్నారు. దీంతో క్రమంగా ఇతర మహిళల నుంచి ఉద్యమానికి మద్దతు పెరుగుతుందని ఉద్యమ నేత సిరత్ సాట్పుట్ తెలిపారు. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా ముంబయిలోనూ ఈ నెల 24 నుంచి 26 వరకూ ఉద్యమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అజాద్ మైదాన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా మహిళా రైతులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ ఆందోళన దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన ముంబయిని మేల్కొలుపుతుందని, రైతుల స్వరాన్ని మరింతగా పెంచుతుందని అల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షులు అశోక్ ధవాలే తెలిపారు. ఈ ఆందోళనలను ముంబయిలో కాకుండా, జిల్లా కేంద్రాల్లో నిర్వహించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం సూచిస్తుంది. మరోవైపు రైతుల ఉద్యమానికి మద్దతుగా రిపబ్లిక్ డే (జనవరి 26)న బీజేపీయేతర పార్టీలన్నీ వీధుల్లో ఆందోళన నిర్వహించనున్నాయి.
మహా వికాస్ అగధి (ఎంవీఏ) కూటమిలోని పార్టీలకు చెందిన సీనియర్ నాయకులంతా ఈ ఆందోళనల్లో పాల్గొననున్నారు. రైతులు తమ నిరసనల్లో రాజకీయ పార్టీలను దూరంగా పెట్టడంతో, ఎంవీఏ సమన్వయ కమిటీ ఈ ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది.