Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొంగతనం నెపంమోపి చెట్టుకు కట్టేసి కొట్టిన పెత్తందార్లు
- బాధితుల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి
పశ్చిమగోదావరి: దొంగతనం నెపం మోపి కొంతమంది పెత్తందారులు దళిత యువకులను అక్రమంగా నిర్బంధించి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలంలోని గణపవారిగూడెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన బాధితుల ఫిర్యాదుతో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... టి.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన సంతోష్, వెంకటేశ్వరరావు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ నెల 18న రాత్రి లింగపాలెం మండలం సింగగూడెం గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. గణపవారిగూడెం వద్ద మోటారు సైకిల్లో పెట్రోల్ అయిపోవడంతో రోడ్డు పక్కన దుకాణంలో బయట పెట్టిన పెట్రోల్ బాటిల్ తీయబోయారు. ఈలోపు దుకాణానికి సంబంధించిన యువతి బయటకు వచ్చి అడక్కుండా పెట్రోల్ బాటిల్ తీయడం ఏమిటి, దొంగతనం చేస్తున్నారా అనడంతో వారిమధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో, గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ నలుగురినీ నిర్బంధించేందుకు ప్రయత్నించారు. ఇరువురు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్లిపోగా, సంతోష్, వెంకటేశ్వరరావును స్థానికులు పట్టుకొని గ్రామానికి చెందిన ఒక పెత్తందారికి చెందిన కోళ్ల దొడ్డిలో ఆ రాత్రంతా బంధించారు. కోడిపుంజులు దొంగిలించారనే నెపంతో 19వ తేదీ ఉదయాన్నే ఆ యువకులను గ్రామ పెత్తందారులు కర్రలు, వైర్లతో కొట్టి చెట్టుకు కట్టేశారు. అనంతరం సాయంత్రం విడిచి పెట్టారు. గాయపడిన యువకులు చింతలపూడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేశామని చింతలపూడి సిఐ మల్లేశ్వరరావు, లింగపాలెం ఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.ఈ ఘటనను సీపీఐ(ఎం) అప్ల్యాండ్ జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.రామకృష్ణ, ఎ.రవి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీంద్ర, ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సిపిఎం నాయకులు పరామర్శించారు.