Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ రిపబ్లిక్ పరేడ్కు వ్యతిరేకంగా ఉత్తర్వులు ఇవ్వలేం
- అనుమతులు మీరే చూసుకోవాలి : ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- ట్రాక్టర్ ర్యాలీ పిటిషన్పై కేంద్రం వెనక్కి
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున రైతులు తలపెట్టిన 'కిసాన్ రిపబ్లిక్ పరేడ్' అనుమతిపై సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ర్యాలీపై తాము ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోమని స్పష్టంచేసింది. ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి ఇవ్వాలా వద్దా? అన్నది పోలీసులే నిర్ణయించుకోవాలని స్పష్టంచేసింది. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వొద్దంటూ ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బోబ్డే, జస్టిస్ ఎఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 'ఏదైనా ర్యాలీకి గానీ, ఊరేగింపునకు గానీ అనుమతుల విషయంపై ఉత్తర్వులు ఇవ్వడాన్ని మేం అన్యాయంగా చూస్తాం. అది పోలీసు విభాగం తేల్చాల్సిన విషయం. అనుమతి ఇవ్వాలా? వద్దా? అన్నది పోలీసులే నిర్ణయించాలి. ఇందుకు వారే సమర్థులు. దీనిపై మేం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయబోం' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వెనక్కి తగ్గిన కేంద్రం
గణతంత్ర దినోత్సవం నాడు రైతుల తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. ఈ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. అది పూర్తిగా పోలీసులకు సంబంధించిన విషయమని చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ట్రాక్టర్ల ర్యాలీపై నిర్ణయాన్ని ఢిల్లీ పోలీసులకు వదిలేస్తున్నట్టు తెలిపిన కేంద్రం.. పిటిషన్ను వెనక్కి తీసుకుంది.
అనుమానాలపై అసంతృప్తి
నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఏర్పాటుచేసిన కమిటీపై రైతు సంఘాల నేతలు అనుమానాలు వ్యక్తం చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తాము కమిటీ సభ్యులకు ఎలాంటి నిర్ణయాధికారం ఇవ్వలేదనీ, అలాంటప్పుడు వారిని కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేసింది. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై గతవారం స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యులతో ప్యానెల్ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కమిటీలో భూపీందర్సింగ్ మాన్, ప్రమోద్ కుమార్, అశోక్ గులాటి, అనిల్ ఘన్వత్ ఉన్నారు. అయితే ఈ కమిటీని రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. వీరంతా ప్రభుత్వానికి అనుకూల వ్యక్తులనీ, సాగు చట్టాలను సమర్థిస్తూ గతంలో వ్యాసాలు కూడా రాశారని తెలిపారు. అలాంటి కమిటీ ముందు తాము హజరయ్యే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ఇది కాస్తా వివాదాస్పదంగా మారడంతో సభ్యుల్లో ఒకరైన భూపీందర్సింగ్ మాన్ కమిటీ నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా... కమిటీపై వస్తున్న విమర్శలపై ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బోబ్డే నేతత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
నిపుణులపై నిందలు తగదు..
''న్యాయమూర్తులు వ్యవసాయ రంగంలో నిపుణులు కాదు. అందుకే ఈ కమిటీని ఏర్పాటుచేశాం. ఇందులో సభ్యులందరికీ ఈ రంగంలో ఎంతో అనుభవం ఉన్నది. అలాగే ఈ కమిటీకి మేం ఎలాంటి నిర్ణయాధికారం ఇవ్వలేదు. వారు ఇరుపక్షాల అభిప్రాయాలను మాత్రమే వింటారు. అలాంటప్పుడు పక్షపాతం అనే ప్రశ్న ఎక్కడొస్తుంది? మేం ఎవరినీ బలవంతపెట్టట్లేదు. మీకు(రైతు సంఘాల నేతలు) నచ్చకపోతే కమిటీ ముందు హాజరుకాకండి. అంతేగానీ.. అభిప్రాయాలు చెప్పారని వారిపై నిందలు వేయడం, వారిని కించపర్చడం సరికాదు. ప్రతి ఒక్కరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. అయితే ఎదుటివారి వాదనలు విన్న తర్వాత ఒక్కోసారి వారి సొంత అభిప్రాయాలు కూడా మారిపోతుంటాయి'' అని ధర్మాసనం తెలిపింది. పిటిషన్పై తమ స్పందన తెలియజేయాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.