Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకున్నది. గణతంత్ర దినోత్సవం రోజు 'ట్రాక్టర్స్ పరేడ్'కు అన్నదాతలు ఓ వైపు సిద్ధమవుతుండగా... మహారాష్ట్ర రాజధాని ముంబయిలో మహాపడావ్ నిర్వహించేందుకు రైతులు బయలుదేరారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. 23 నుంచి 26 వరకూ దేశవ్యాప్తంగా నిరసనలు తెలపాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సుభాస్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది రైతులు నాసిక్ నుంచి ముంబైకి శనివారం కవాతు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతోపాటు, మరాట్వాడా రీజియన్ పర్బని జిల్లా నుంచి బయలుదేరిన ర్యాలీలో విద్యార్థిని క్రాంతి బుర్ఖుండే ఒకరు. ఈ బృందం శనివారం నాసిక్కు చేరుకొని అక్కడి నుంచి ముంబయికి బయలుదేరింది. ఈ రైతు వ్యతిరేక చట్టాల ద్వారా రైతులను అణిచివేసేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆమె విమర్శించారు. 'కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర సర్కార్ ఈ చట్టాలను తీసుకువచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న నిరసనలో 60 మందికి పైగా రైతులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అయినా.. రైతుల దుస్థితిని ప్రభుత్వం పట్టించుకోవటంలేదు. అందువల్ల ఆందోళన చేస్తున్న కర్షకులకు మా మద్దతును అందించేందుకు ఈ ర్యాలీలో పాల్గొంటున్నాం. సాగు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముంబయికి వెళ్తున్నాం. మా ఉత్పత్తులకు ఎంఎస్పి (కనీస మద్దతు ధర) కూడా కావాలి' అని క్రాంతి బుర్ఖుండే అన్నారు. గణతంత్ర దినోత్సవం నాటికి 50 వేల మందికిపైగా రైతులు ముంబయికి చేరుకోనున్నట్టు ఆలిండియా కిసాన్సభ జాతీయ అధ్యక్షులు అశోక్ధావలే చెప్పారు.