Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడుగడుగునా ఆటంకాలు...
- ఒడిశా రైతుల ఆగ్రహం
లక్నో : ఒడిశాకు చెందిన నవనిర్మాణ్ కషక్ సంఘటన్ (ఎన్కేఎస్) రైతు సంఘానికి చెందిన 500 మందికిపైగా రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీరిలో 70మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. సికంద్రా సమీపంలోని గురు కా తాల్ వద్ద ఆగ్రా - ఢిల్లీ జాతీయ రహదారిపై రైతులను నిలిపివేశారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 26న ఢిల్లీలో చేపట్టనున్న ట్రాక్టర్ పరేడ్కు మద్దతు తెలిపేందుకు వీరు ఢిల్లీకి బయలుదేరారు.
పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్ మీదుగా ప్రయాణిస్తూ.. అన్ని అడ్డంకులను దాటుకుని సుమారు 1,800 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం యూపీలోని చందౌలి సరిహద్దుకు చేరుకున్నారు. గత మూడు రోజులుగా వారు ఢిల్లీ చేరుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తమపై పోలీసులు, అధికారులు, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయనీ, ట్రాక్టర్ పరేడ్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఏదిఏమైనా ఢిల్లీ పరేడ్లో పాల్గొని తీరుతామనీ స్పష్టంచేశారు. భవిష్యత్ తరాల కోసం చేస్తున్న ఈ చారిత్రాత్మక పోరాటంలో తాము భాగస్వాములమవుతామని వారు తెలిపారు.
ఈ నెల 15న తామంతా ఆరు బస్సుల్లో ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి బయలుదేరామని ఎన్కేఎస్ జాతీయ కన్వీనర్ అక్షయ్కుమార్ తెలిపారు. బీహార్ చేరుకునేంత వరకు తమ ప్రయాణం సాఫీగా సాగిందన్నారు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుకు రాగానే తమను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలో రాత్రిపూట బస చేసేందుకు కూడా అధికారులు తమకు అనుమతించలేదని ఆరోపించారు. దీంతో రాత్రంతా జాతీయ రహదారిపైన అలాగే కూర్చున్నామని, పోలీసులు తమను చుట్టుముట్టారని అన్నారు. అర్థరాత్రి పూట జౌన్పూర్ చేరుకున్నామనీ, అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు తమను నిలువరించారని అన్నారు. అక్కడి నుండి పాలి చేరుకున్నామనీ, అక్కడ కూడా అవే బెదిరింపులు ఎదురయ్యాయని చెప్పారు. లక్నోలోకి వెళ్ళేందుకు అనుమతించబోమనీ, వెనక్కి వెళ్లాల్సిందేనని పోలీసులు బెదిరించారని చెప్పారు. తాము వెనక్కి వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో.. లక్నో ఔటర్ రింగ్ రోడ్ మీదుగా కాన్పూర్ వెళ్లాల్సిందిగా ఆదేశించారు. జాన్పూర్ చేరుకున్న తమను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు. ఆహారం కానీ, కనీసం తాగేందుకు నీరు కూడా ఇవ్వలేదని, ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించినా అధికారులు పట్టించుకోలేదని చెప్పారు.
కాన్పూర్లోనూ పోలీసులు అదేవిధంగా ప్రవర్తించారనీ, కాన్పూర్ - ఫతేపూర్ సరిహద్దులో మహారాజ్పూర్ వద్ద పోలీసులు తమను బుధవారం రాత్రి ఆరు గంటల పాటు నిలువరించారని అన్నారు. పలు చోట్ల నిలిపివేయడంతో పాటు పోలీసులు వేధింపులకు గురిచేశారని ఎన్కెఎస్ యుని ఇన్ఛార్జ్ హిమాన్షు తివారీ అన్నారు. కాన్పూర్ సమీపంలోని రూమా వద్ద తమ బస్సులను సీజ్ చేశారని అన్నారు. రైతులు ఢిల్లీకి చేరకుండా చూడాలని పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారని అన్నారు. పలువురు రైతు నేతలను గహనిర్బంధంలో ఉంచారనీ, బెదిరింపులకు దిగారని అన్నారు.
ఒడిశా రైతుల ఆగ్రహం
ఒడిశా నుంచి బయలుదేరిన మా బందానికి పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, యూపీల నుంచి వచ్చిన మరో 300 మంది రైతులు తోడయినట్టు ఒడిశా గిరిజన హక్కుల కార్యకర్త అభిషేక్ తెలిపారు. ఇంతమంది రైతులు తమతో పాటు వస్తారని ఊహించలేదని అన్నారు. ఎలాగైనా ఢిల్లీ చేరుకుని ట్రాక్టర్ పరేడ్లో పాల్గొంటామని చెప్పారు. జనవరి 21 నాటికి ఢిల్లీ చేరుకోవాలని అనుకున్నామనీ, అడుగడుగునా పోలీసులు అడ్డుకోవడంతో.. ఇప్పటికి ఆగ్రా చేరుకోగలిగామని అన్నారు. తరచూ తమ మార్గాన్ని మార్చుకుంటూ రావడంతో.. ఇంత సమయం పట్టిందన్నారు.