Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోల్, డీజీల్పై 25 పైసల చొప్పున పెంపు
- వరుసగా రెండో రోజు.. వారంలో నాలుగోసారి ధరలు పైకి
- కేంద్రంపై వాహనదారులు, సామాన్యప్రజల ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో వాహనదారులు, సాధారణ ప్రజలపై మరోసారి 'చమురు' పిడుగు పడింది. పెట్రో ధరలు మరోసారి రికార్టు స్థాయికి చేరు కున్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ధరల నోటిఫి కేషన్ ప్రకారం.. పెట్రోల్, డీజీల్లపై లీటర్ మీద 25 పైసల(దాదాపు) చొప్పున పెరిగాయి. పెరిగిన చమురు రేట్లతో ముఖ్యంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇతర పన్నులతో కలిసి ఆకాశాన్నంటాయి. వరుసగా రెండో రోజు, వారం వ్యవధిలోనే నాలుగుసార్లు
పెట్రో ధరలు ఈ విధంగా పెరగడం గమనార్హం. తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. లీటర్ పెట్రోల్ ధర దేశరాజధానిలో రూ. 85.70, వాణిజ్య రాజధాని ముంబయిలో రూ.92.28గా నమోదయ్యాయి. చెన్నైలో రూ. 88.29, కోల్కతాలో రూ. 87.11గా ధరలు రికార్డయ్యాయి. ఇక లీటర్ డీజీల్ రేట్లు ఢిల్లీలో రూ. 75.88ని తాకింది. ముంబయిలో రూ. 82.66ని చేరింది. చెన్నైలో రూ. 81.14, కోల్కతాలో రూ. 79.48కు డీజీల్ ధరలు చేరుకున్నాయి. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై 26పైసలు పెరుగుదలతో రూ. 89.15గా ధర నమోదైంది. లీటర్ డీజీల్ ధర 27పైసలు పెరిగి రూ.82.80గా రికార్డయ్యింది. ఈ వారంలోనే పెట్రో ధరలు రూపాయి వరకు పెరిగింది రాష్ట్రాల్లోనూ అదనపు ట్యాక్సులు తోడవడంతో ఈ ధరలు మరింత ప్రియం అయ్యాయి. దీంతో దేశంలో ఇంధన ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. పెరిగిన ధరల ప్రభావం వాహనదా రులు, సాధారణ ప్రజలపై తీవ్రంగా ఉండనున్నది. ఫలితంగా నిత్యావసర ధరలు ఆకాశాన్నంటే అవకాశం ఏర్పడనున్నది. దీంతో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వినియోగదారులపై భారాన్ని తగ్గించాలనే డిమాండ్ను వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పెట్రో ధరలను అదుపు చేయాలనీ, ఆయిల్ దేశాలను సాకుగా చూపుతూ వినియోగదారులపై భారం మోపడం సరికాదని దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఈనెల 6న ఇంధన ధరలను సవరించాయి. అయితే అప్పటి నుంచి లీటర్ పెట్రోల్పై రూ. 1.99, డీజీల్పై రూ. 2.01 లు పెరగడం గమనార్హం. కాగా, చివరగా 2018, అక్టోబర్ 4న ఇంధన ధరలు ఆల్టైం హైకు(రికార్డు స్థాయికి) చేరుకున్నాయి. అయితే ఆ సమయంలో ప్రభుత్వం పెట్రోల్, డీజీల్లపై రూ.1.50 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించగా, ఆయిల్ కంపెనీలు రూ.1ని తగ్గించడంతో వినియోగదారులకు కాస్త ఉపశమనం ఏర్పడింది. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అలాంటి సూచనలేవీ లేకపోవడం ఆందోళనను కలిగిస్తున్నది.