Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ రిపబ్లిక్ పరేడ్ కు అనుమతి
- నేడు ముంబయిలో భారీ సభ
- ఒడిశా రైతులను అడ్డుకున్న పోలీసులు
- మమ్మల్ని చంపేందుకు కుట్ర: రైతు నేతలు
- 59వ రోజు కొనసాగిన ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తు న్నారు. పలు దఫాలుగా రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. అయినా రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించడం లేదు. చట్టాలను రద్దు చేసేదాకా ఉద్యమం ఆగబోదని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. దీంతో రైతుసంఘాలు ఈనెల 26న ఢిల్లీలో కిసాన్పరేడ్ నిర్వహించా లని నిర్ణయించాయి. పరేడ్లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైతులు ఢిల్లీకి పయనమయ్యారు. పరేడ్కు మొదట అమిత్షా ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు అంగీ కరించలేదు. అనేక అడ్డంకులు కల్పించేందుకు ప్రయత్నిం చారు. అయినా రైతులు వెనక్కితగ్గలేదు. ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు శనివారం కిసాన్ పరేడ్కు అనుమతిచ్చారు. పోలీసులు మూడు ప్రాంతాలను ప్రతిపాదించగా, రైతు సంఘాల నేతలు ఢిల్లీ అవుటర్ రింగ్ రోడ్డునే పరేడ్ చేపట్టాలని నిర్ణయించారు. రైతు సంఘాలు ఆదివారం సమావేశమై రోడ్డు మ్యాప్ను ప్రకటించనున్నాయి. ఇదిలావుండగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం 59వ
రోజుకు చేరుకుంది.
మమ్మల్ని చంపేందుకు కుట్ర: రైతు నేతలు
జనవరి 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల పరేడ్లో తమలో నలుగురిని చంపేందుకు కుట్ర జరుగుతున్నట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. తద్వారా కవాతును భగం చేసి ఆందోళనను అణదొక్కేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. ఇందుకోసం రంగంలోకి దింపిన ఓ వ్యక్తిని తాము పట్టుకున్నట్టు తెలిపారు. ముఖానికి ముసుగు తొడిగిన అతణ్ని మీడియా ముందుకు తీసుకొచ్చారు. పోలీసుల వలే నటించి కవాతులో రైతులపై లాఠీ చార్జి చేయాలని అతనికి ఎవరో ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. మీడియా సమావేశం అనంతరం అతణ్ని హర్యానా పోలీసులకు అప్పగించామని రైతు సంఘం నేత కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. ఈ కుట్రకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేస్తే కుటుంబ సభ్యులను చంపేస్తామని, దీన్ని అమలు చేయాల్సిన వ్యక్తులను బెదిరించినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. తమకు ఎలాంటి ముసుగు తొడిగిన వ్యక్తి సమాచారం అందలేదని తెలిపారు.
కాల్పులు జరపాలనుకున్నాం : దుండగుడు
రైతులు తాము పట్టుకున్న ముసుగు తొడిగిన వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ...''జనవరి 26న రైతులు నిర్వహించ తలపెట్టిన ర్యాలీని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ వారు ఆగకపోతే.. తొలుత గాల్లోకి కాల్పులు జరపాలనుకున్నాం. తరువాత మా బృందంలోని మరికొంత మంది సభ్యులు వెనక నుంచి కాల్పులు జరుపుతారు. అక్కడ ఉన్న ఢిల్లీ పోలీసులు.. రైతులే కాల్పులు జరుపుతున్నారని భావించి ఎదురు కాల్పులు జరుపుతారు'' అని వివరించారు.
మంత్రుల కమిటీ ప్రతిపాదనకు చట్టబద్ధత ఉందా?: ఏఐకేఎస్
మూడు వ్యవసాయ చట్టాల అమలను18 నెలలు పాటు నిలిపివేస్తామని క్యాబినెట్ కమిటీ (సీసీ) చేసిన ప్రతిపాదనకు చట్టపరమైన అనుమతి ఉందా? అని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకేఎస్) ప్రశ్నించింది. మంత్రుల కమిటీ ప్రతిపాదనకు సంబంధించి చట్టబద్ధత అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేయాలని ఎఐకేఎస్ కోరింది. ''పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని కొనసాగించడానికి, నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఒక చట్టాన్ని సవరించడానికి, రద్దు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. అందువల్ల సీసీ ప్రతిపాదన పార్లమెంటు అధికారాల ఉల్లంఘనగానూ, చట్ట వ్యతిరేకంగానూ ఉంది'' అని ఎఐకేఎస్ పేర్కొంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ అన్ని చట్టపరమైన అంశాలను చర్చించిన తరువాత రూపొందించామని, ఈ డిమాండ్ను నీరుగార్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో 15 వేలు మంది రైతులు మార్చ్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అఖిల భారత కిసాన్ సభ (ఎఐకేఎస్) మహారాష్ట్ర యూనిట్ శనివారం నాసిక్ నుంచి ముంబాయి వరకు 15 వేల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా వాహన మార్చ్ ప్రారంభించింది. నాసిక్లోని గోల్ఫ్ క్లబ్ మైదాన్ నుంచి వందలాది టెంపోలు, పిక్ అప్లు, ఇతర వాహనాల్లో మార్చ్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుంది. ఎఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంయుక్త కిసాన్ మోర్చా నేత, మాజీ ఎంపీ హన్నన్ మొల్లా, మహా వికాస్ అగాడిలోని మూడు పార్టీల అగ్ర నాయకులు, ఎన్పీసీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి బాలా సాహెబ్ తోరట్, శివసేన నేత, మంత్రి ఆదిత్య ఠాక్రే, వామపక్ష, ప్రజాస్వామ్య పార్టీల నాయకులు ప్రసంగించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలాలో ఎఐకేఎస్, సీఐటియూ ఆధ్వర్యాన భారీ కవాతు నిర్వహించారు.
ఒడిశా రైతులను అడ్డుకున్న పోలీసులు
ఒడిశాకు చెందిన సుమారు 500 మంది రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీరిలో 70 మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. సికంద్రా సమీపంలోని గురు కా తాల్ వద్ద ఆగ్రా - ఢిల్లీ జాతీయ రహదారిపై రైతులను నిలిపివేశారు. ఈ 26న పలువురు రైతులు ఢిల్లీలో చేపట్టనున్న ట్రాక్టర్ పరేడ్కు మద్దతు తెలిపేందుకు వీరు ఢిల్లీకి బయలుదేరారు. భారతీయ కిసాన్ యూనియన్ బ్యానర్ కింద ఇటీవల జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో కూడా వీరు పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్ మీదుగా ప్రయాణిస్తూ.. అన్ని అడ్డంకులను దాటుకుని సుమారు 1800 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం యూపీలోని చందౌలి సరిహద్దుకు చేరుకున్నారు. గత మూడు రోజులుగా వారు ఢిల్లీ చేరుకునేందుకు యత్నిస్తూనే ఉన్నారు. తమపై పోలీసులు, అధికారులు, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, ట్రాక్టర్ పరేడ్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ.. ఢిల్లీ పరేడ్లో పాల్గొని తీరతామని, భవిష్యత్ తరాల కోసం చేస్తున్న ఈ చారిత్రాత్మక పోరాటంలో తాము భాగస్వాములమవుతామని ఎన్కేఎస్ జాతీయ కన్వీనర్ అక్షయకుమార్ తెలిపారు.