Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని వామపక్ష పార్టీలు స్పష్టం చేశాయి. చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి ఈ వారంలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో చట్టాలను రద్దు చేస్తామని రైతు సంఘాలకు తెలియజేయాలని ఐదు వామపక్ష పార్టీలు ఆదివారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశాయి. అన్నదాతల చారిత్రాత్మక పోరాటానికి వామపక్షాలు తమ పూర్తి మద్దతును, సంఘీభావాన్ని పునరుద్ఘాటించాయి. సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ (ఎంఎల్), ఏఐఎఫ్బీ, ఆర్ఎస్పీ తరపున ఆయా పార్టీల ప్రధాన కార్యదర్శులు వరుసగా సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాంకర్ భట్టాచార్య, దేబబ్రత బిశ్వాస్, మజోన్ భట్టాచార్య ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
కొత్త వ్యవసాయ చట్టాలను 18 నెలల పాటు నిలిపేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. అయితే పార్లమెంట్ చేసిన చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడడం, ఆ తరువాత ప్రభుత్వం గెజిట్ ద్వారా నోటిఫై చేసినందున ఈ చట్టాలను వారు (ప్రభుత్వం) నిలపలేరు . అవి రద్దు అయితే తప్ప అమలులో ఉన్నట్టే లెక్క. అందువల్ల ప్రభుత్వం సహేతుకంగా వ్యవహరించదలచుకుంటే చట్టాలను వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా వ్యవసాయ రంగ సంస్కరణలపై కేంద్రం రైతులు, ఇతర వాటాదారులతో పాటు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలనీ, వాటిపై ఇంకా ఏమైనా పరిశీలన, చర్చలు అవసరమైతే అప్పుడు పార్లమెంటు ముందుకు తగు ప్రతిపాదనలతో రావాలని వారు పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో గడ్డ కట్టించే చలిలోనూ పోరాటం సాగిస్తున్న లక్షలాది మంది రైతులు చూపిస్తున్న పట్టుదల, ఐక్యత, తెగువ అబ్బురపరుస్తోందని వామపక్ష పార్టీల నేతలు కొనియాడారు. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రైతాంగ ఉద్యమంలో 100 మందికి పైగా రైతులు అసువులు బాశారని పేర్కొన్నారు.. రోజురోజుకు ఈ ఉద్యమం బలోపేతం అవుతోందని అన్నారు. మన లౌకిక ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రక్షించేందుకు, చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ల పరేడ్ నిర్వహించాలన్న రైతుల దేశభక్తియుత సంకల్పాన్ని అభినందిస్తున్నామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.