Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని తల్లికి పంజాబ్ రైతు భావోద్వేగ లేఖ
న్యూఢిల్లీ : ''... చాలా ఆశతో ఈ లేఖను రాస్తున్నాను. మీ కుమారుడు దేశ ప్రధాని అయిన మోడీ.. ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయగలిగేలా మీరే ఒప్పించాలి.. ఎవరి మాటనైనా తిరస్కరించవచ్చు కానీ.. తల్లి మాటను కుమారుడు తిరస్కరించలేరని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒక్క తల్లి మాత్రమే తన కుమారుడిని మార్చగలదు.. అప్పుడు దేశమంతా మీకు కృతజ్ఞతలు తెలుపుతుంది'' ... అని నల్ల చట్టాలను రద్దు చేసేలా ప్రధాని మోడీని ఒప్పించాలంటూ ప్రధాని తల్లి హీరాబెన్కు ఒక రైతు భావోద్వేగంతో లేఖ రాశారు. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ సుమారు రెండు నెలలుగా దేశరాజధాని ఢిల్లీలో తనతోపాటు వేలాది మంది రైతులు ఆందోళన చేస్తున్నారని ఆ లేఖలో తెలిపారు. తల్లిగా తన కుమారుడిని ఒప్పించేందుకు సర్వశక్తులు ఒడ్డుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా గోలూ కా మోద్ గ్రామానికి చెందిన రైతు హర్ప్రీత్ సింగ్... రైతు ఆందోళనకు సంబంధించిన పలు అంశాలను పేర్కొంటూ హిందీలో ఈ లేఖను రాశారు. ఢిల్లీలోని వాతావరణ పరిస్థితులు, దేశవ్యాప్తంగా ఈ చట్టాలను రద్దు చేయాలంటూ వెల్లువెత్తుతున్న ఆందోళనలు, దేశ ప్రజల ఆకలిని తీర్చాలన్న రైతుల ఆకాంక్షతో పాటు సరిహద్దుల్లో భద్రత తదితర అంశాలను ప్రస్తావించారు.
''భారమైన హృదయంతో ఈ లేఖను రాస్తున్నానని.. ఈ నల్లచట్టాల కారణంగా దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు చలిని సైతం లెక్క చేయకుండా రహదారులపై నిద్రించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మీకు తెలిసే ఉంటుంది'' అని అన్నారు. ఆందోళన చేస్తున్న రైతుల్లో 90-95 ఏళ్లు పైబడిన వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని, చల్లటి వాతావరణంతో అనేకమంది అనారోగ్యానికి గురవుతున్నారని లేఖలో తెలిపారు. ఉద్యమంలో మరణించిన రైతులు కూడా అమరవీరులేనని, తాము కూడా అదే దుస్థితికి చేరుకోవచ్చని.. ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అదానీ, అంబానీ, ఇతర కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చే ఈ నల్లచట్టాల కారణంగానే ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుత నిరసన కొనసాగుతోందని తెలిపారు. ఆ ఆందోళనలో అనేక మంది రైతులు మరణించారని, వారిలో కొందరు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. కాగా, అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్నారంటూ సింగ్ను ఇటీవల సిమ్లాలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బెయిల్పై విడుదలయ్యారు.