Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్మీ కెప్టెన్ పై పోలీసుల ఛార్జిషీటు
షోపియాన్ : జమ్ముకాశ్మీర్ షోపియాన్ జిల్లాలో గత జులైలో జరిగిన నకిలీ ఎన్కౌంటర్లో నిందితులైన ఆర్మీ కెప్టెన్, ఇద్దరు పౌరులపై సిట్ బృందం ఛార్జిషీటు నమోదు చేసింది. ఆధారాలు నాశనం చేయడానికి కూడా ప్రయత్నించారని పేర్కొంది. అక్కడి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఆర్మీ కెప్టెన్ భూపేంద్ర సింగ్ తన ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని కూడా అందులో పేర్కొంది. షోపియాన్ జిల్లా అంషిపురలో 2020 జులై 18న తీవ్రవాదులన్న ఆరోపణలతో ముగ్గురు యువకులను ఆర్మీ కాల్చి చంపింది. మరణించిన ముగ్గురు యువకులు అమాయకులని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. జమ్ముకాశ్మీర్ పోలీసుల నేతృత్వంలోని సిట్ విచారణ జరిపి, ఛార్జిషీట్ నమోదు చేసింది. హీర్పోర పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎన్కౌంటర్ వద్ద స్వాధీనం చేసుకున్న ఆయుధాల గురించి కెప్టెన్, నిందితులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సిట్ ఛార్జిషీట్లో పేర్కొంది. పైగా, కెప్టెన్ భూపేంద్ర సింగ్, నిందితులు తబిష్ నజీర్, బిలాల్ అహ్మద్ లోన్ ఆధారాలు నాశనం చేయడానికి ఎన్కౌంటర్ ప్రదేశం వద్ద మంటలు పెట్టారని తెలిపింది. 75 మంది సాక్షులను విచారించి, నిందితుల కాల్ డేటా ఆధారంగా ఛార్జిషీట్ తయారు చేసినట్లు సిట్ బృందం వివరించింది.