Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఏఏ నిరసనకారులపై విరిగిన లాఠీ
- అసోంలో రెచ్చిపోయిన పోలీసులు
గువహతి : అసోంలో పోలీసులు రెచ్చిపోయారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులపై ఖాకీలు లాఠీచార్జి చేశారు. సరిగ్గా రాష్ట్రంలో మోడీ పర్యటనకు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా 'ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్' (ఆసు) కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా తేజ్పూర్లో కాగడాల
ప్రదర్శనను నిర్వహించారు. మూడురోజుల ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, ఆందోళనకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రధాని మోడీ, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా పర్యటనలకు ముందుగానే విద్యార్థులు ఈ ఆందోళనను చేపట్టారు. అయితే, ఈ తరుణంలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు. ర్యాలీలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఆసుకు చెందిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. అయితే పోలీసుల దమనకాండను ఆసు ఖండించింది. ఇందుకు నిరసనగా సొనిట్పూర్ బంద్కు పిలుపునిచ్చింది. సీఏఏను రద్దు చేసేదాకా తమ నిరసనలు ఆగవనీ, రానున్న రోజుల్లో వీటిని మరింత తీవ్రతరం చేస్తామని యూనియన్ సముజ్జల్ భట్టాచార్య, దీపాంకనాథ్లు కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.