Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో లాంగ్మార్చ్
ధానే : ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా, మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతు దండు కదిలింది. ఆదివారం మహారాష్ట్రలో కిసాన్ లాంగ్ మార్చ్ నిర్వహించారు. రాష్ట్రంలోని 21 జిల్లాల నుంచి 15 వేల మంది రైతులు లాంగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐకేఎస్ నేతృత్వంలో జరిగిన ఈ మార్చ్లో రైతులతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా రైతులు, యువ రైతులు కదం తొక్కారు. మార్చ్కు ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి అశోక్ ధవాలే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజిత్ నవాలే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సునీల్ మలుసారే, బార్క్యా మంగట్, రతన్ బుధర్, రాడ్కా కలంగ్డా, సావ్లిరామ్ పవార్ నేతౄత్వం వహిస్తున్నారు. ఈ లాంగ్ మార్చ్ ముంబయి వైపుగా సాగుతున్నది. దారిలో ఇగత్పురి, షాహాపూర్ తహసిల్స్కు చెందిన వందలాది మంది సీఐటీయూ అనుబంధ కార్మికులు పూలమాలలు వేసి లాంగ్ మార్చ్కు స్వాగతించారు. కళ్యాణ్-భివాండి క్రాస్రోడ్స్లో సీపీఐ(ఎం) థానే పట్టణ కమిటీ, డివైఎఫ్ఐ నేత అమృత్ వేలా గురుద్వారా స్వాగతం పలికారు. మలాడ్ చెక్ నాకా వద్ద జాతా ముంబయికి చేరింది. విక్రోలిలోని కన్నమ్వర్ నగర్ వద్ద సీపీఐ(ఎం) నేత మహేంద్ర సింగ్ నేతృత్వంలోని ముంబయిలోని సీపీఐ(ఎం), సీఐటీయూ, డివైఎఫ్ఐ, ఐద్వా వందలాది మంది కార్యకర్తలు రైతు లాంగ్ మార్చ్ను స్వాగతించారు. అక్కడ నుంచి ఆజాద్ మైదాన్ వైపు సాగింది. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆజాద్ మైదానంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, మహా వికాస్ అగాడీ ప్రభుత్వం తరపున మంత్రులు సీనియర్ నేతలు, వామపక్ష, ప్రజాస్వామ్య నాయకులు ప్రసంగించనున్నారు. అనంతరం రాజ్భవన్కు 50 వేల మంది రైతులతో ర్యాలీ జరగనున్నది. అనంతరం రైతు నేతలు గవర్నర్కు మెమోరాండం సమర్పించనున్నారు.