Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా ఎన్జీఓల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేస్తూ ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పును వెలువరించింది. ఏపీలో స్థానిక సంస్థలను నిర్వహించా లన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ నిర్ణయాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్రారులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది. ఎస్ఈసీ నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహత్గి కోర్టుకు విన్నవించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. పోలీసులు వ్యాక్సిన్ భద్రతలో ఉన్నారని వివరించారు. లక్షల మంది ఫ్రంట్లైన్ వారియర్స్కు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆ ప్రక్రియ పూర్తి కాకముందే ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదని పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 5లక్షల ఉద్యోగులకు కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలని, వారి సహకారం లేనిది ఎన్నికలు నిర్వహించలేమని ధర్మాసనం వాదనలు వినిపించారు. మార్చి 1 నుంచి ఎన్నికలు నిర్వహించడానికి అభ్యంతరం లేదన్నారు. జనవరి 28 కల్లా ఫ్రంట్లైన్ వర్కర్లకు వాక్సిన్ ఇవ్వడం పూర్తి అవుతుందని వివరించారు. వాక్సిన్, ఎలక్షన్ ఒకేసారి నిర్వహించాలని హైకోర్టు చెప్పడం సరికాదని రోహత్గీ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించని న్యాయస్థానం ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది. ''ఎన్నికలు జరపడం ఎన్నికల సంఘం విధి.. ఈ వ్యవహారంపై కోర్టు జోక్యం చేసుకోవడం సబబు కాదు. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా? ఏదో ఒక వంకతో ఎన్నికలు ఆపాలని చూస్తున్నారు. ఇది రాజకీయ ప్రక్రియలో భాగం. మీ రాతలే మీ ఉద్దేశాన్ని తెలుపుతున్నాయి. మీరు ఎన్నికల కమిషనర్పై రాసిన విధానం మీ ఆలోచనను చూపుతున్నాయి. చట్ట వ్యతిరేకంగా ఎన్జీవోలు వ్యవహరిస్తున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడేమో ఎన్నికలు కావాలన్నారు. ప్రభావం తగ్గినప్పుడేమో వద్దంటున్నారు. దేశంలో రాజ్యాంగ బద్ధమైన వ్యక్తులు ఏం చేయాలి? ఏం చేయకూడదు? అని కోర్టు చెప్పాలా? ఎన్నికలు వాయిదా వేసుకుంటూ వెళ్లడం సరికాదు'' అని జస్టిస్ సంజరు కిషన్ అన్నారు. అహం ఘర్షణలో భాగం కాలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.