Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు
- వ్యవసాయ నల్ల చట్టాలు రద్దయ్యే వరకూ
- ఉద్యమం ఆగదు : వి.శ్రీనివాసరావు
విజయవాడ:కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో ట్రాక్టర్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. చట్టాల అమలును వాయిదా వేయడం కాదని, చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని నినదించారు. రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు నుంచి తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీ వరకూ ట్రాక్టర్లు, బైక్లతో సోమవారం సుమారు ఆరు కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు, ఎపి కౌలు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసే వరకూ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. అంబానీ, ఆదానీల కోసమే మోడీ ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చిందన్నారు. ఢిల్లీలో, దేశవ్యాప్తంగా రైతులు చేస్తోన్న పోరాటం చారిత్రాత్మకమైనదని, ఇది మరో స్వాతంత్య్రోద్యమం అని అన్నారు. నూతన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసి రైతులు కోరుతున్న మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఆచంట మండలంలో రైతులు ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కెవివి ప్రసాద్ పాల్గొన్నారు. రైతుల పోరాటానికి మద్దతుగా శ్రీకాకుళంలో కవులు, రచయితలు, కళాకారుల సంఘం ఆధ్వర్యాన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొని ప్రసంగించారు. కరోనా సంక్షోభంలోనూ అత్యధిక వద్ధి రేటును నమోదు చేస్తూ ప్రపంచానికే తలమానికంగా ఉన్న దేశ వ్యవసాయరంగం నడ్డివిరిచి కార్పొరేట్లకు తాకట్టు పెట్టిన ఘనత మోడీకే దక్కిందని విమర్శించారు. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం బిజెపి విధానాలను కొనసాగిస్తోందని ధ్వజమెత్తారు. కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యాన పాలకొండ మండలంలో ఎడ్ల బళ్ల ర్యాలీ నిర్వహించారు. 'ప్రభుత్వ విధానాలు-కార్మికులు, రైతులపై ప్రభావం' అనే అంశంపై భామినిలో సిఐటియు ఆధ్వర్యాన సదస్సు జరిగింది. విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో సిపిఎం, సిఐటియు, గిరిజన సంఘం, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యాన బైక్ ర్యాలీలు నిర్వహించారు. 'రైతు సంఘీభావ యాత్ర' పేరుతో సిఐటియు, డిఫెన్స్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యాన చేపట్టిన బైక్ ర్యాలీ రెండో రోజూ కొనసాగింది. అరకులోయలో జరిగిన బైక్ ర్యాలీలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కిల్లో సురేంద్ర, హుకుంపేట మండలంలో జరిగిన బైక్ ర్యాలీలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలంలోని పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకూ ట్రాక్టర్లు, బైకులతో ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లాలో రెండో రోజూ జీపు జాతా కొనసాగింది. సిపిఎం, సిపిఐ, కాంగ్రెసు, రైతు సంక్షేమ సంఘం, ఐద్వా, పికెఎస్, ముస్లిం వెల్ఫేర్ సంఘం నాయకులు బొబ్బిలిలో ఈ జాతాకు ఘన స్వాగతం పలికారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.. వజ్రకరూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించతలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు.