Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గంటకు రూ.90 కోట్లు
- అదే సామాన్యుడికైతే పది వేల సంవత్సరాలు పడుతుంది
- పెరిగిపోతున్న ఆర్థిక అసమానతలు : ఆక్స్ఫామ్ నివేదిక
న్యూఢిల్లీ : కరోనా సమయంలో ఉపాధి కరువై ప్రజల ఆదాయాలు అథ్ణపాతాళానికి పడిపోతే రిలయెన్స్ ఇండిస్టీస్ అధినేత ముఖేష్ అంబానీ సంపద కొండలా పెరిగిపోయింది. ఒక్క చెమట బొట్టు కూడా రాల్చకున్నా ఈ అపర కుబేరుడు ఆర్జించే సంపాదన గంటకెంతో తెలుసా? అక్షరాలా 90 కోట్ల రూపాయలు. అంటే నిపుణతలేని ఒక సాధారణ కార్మికుడు పది వేల సంవత్సరాలు కష్టపడితే కానీ సంపాదించలేనిది ఒక్క గంటలో అంబానీ సంపాదిస్తున్నాడన్నమాట. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తరువాత దేశంలో ఆర్థిక అసమానతలు ఎంతగా పెరిగిపోతున్నాయో ఆక్స్ఫామ్ తాజాగా వెల్లడించిన నివేదిక మరోసారి బయటపెట్టింది. 'అసమానతల వైరస్' అన్న శీర్షికతో ఆక్స్ఫామ్ ఈ నివేదికను విడుదలజేసింది. రిలయన్స్ బాస్ ఒక సెకనులో సంపాదించిన మొత్తాన్ని నైపుణ్యం లేని ఒక కార్మికుడు సంపాదించడానికి మూడేళ్లు పడుతుందని ఆ నివేదిక పేర్కొంది. కరోనా సమయంలో అంబానీ గంటకు రూ.90 కోట్లు సంపాదించగా, అదే సమయంలో దేశవ్యాప్తంగా దాదాపు 24 శాతం మంది ప్రజలు నెలకు కేవలం రూ.3 వేలు మాత్రమే సంపాదించగలిగారు.
అసమానతలు పెంచిన కరోనా
ఒక్క అంబానీ సంపదతో 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులు కనీసం ఐదు నెలల పాటు దారిద్య్రం నుండి బయటపడవచ్చని ఆ నివేదిక సూచించింది. ఇప్పటికే సంపన్నులు, నిరుపేదల మధ్య వున్న అసమానతలను కరోనా మరింత పెంచిందని ఆ నివేదిక పేర్కొంది. కేవలం భారత్లోనే కాదు, మొత్తంగా ప్రపంచ దేశాలన్నింటిలో ఆదాయ అసమానతలు పెరిగాయని తెలిపింది. ప్రభుత్వాలు ఆర్థిక విధానాల్లో తగిన మార్పులు చేపట్టకపోతే.. ఈ అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందని, దీర్ఘకాల మహమ్మారిగా మారే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. దేశంలో వంద మంది కోటీశ్వరుల ఆస్తులు కరోనా సమయంలో 35 శాతం పెరిగాయి. వారి మొత్తం ఆస్తుల విలువ రూ.12,97,822 కోట్లకు పెరిగింది. 13.8 కోట్ల మంది నిరుపేద భారతీయులకు ఒక్కొక్కరికి రూ.94.045 ఇవ్వడానికి ఈ మొత్తం సరిపోతుందని నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సమయంలో ఆస్తులు పెంచుకున్న కోటీశ్వరులు కలిగిన దేశాల్లో భారత్ ఆరవ స్థానంలో వుంది. అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్లు ముందు స్థానాల్లో వున్నాయి. మొదటి 11 మంది కోటీశ్వరుల సంపదతో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా ఆరోగ్య మంత్రిత్వ శాఖను పదేళ్లపాటు నిర్వహించవచ్చని ఆ నివేదిక వెల్లడించింది.
కరోనా ప్రభావం పేదలపైనే అధికం..
కరోనా సంక్షోభంతో ప్రపంచంలో పేదలు మరింత పేదరికంలోకి జారిపోయినట్లు ఆక్స్ఫామ్ నివేదిక వెల్లడించింది. ప్రతి ఏడాది సంపన్నుల వద్ద పోగవుతున్న సంపదకు ఎలాంటి ఢోకాలేదని పేర్కొంది. కరోనా మూలంగా పేదలు ఉపాధి కోల్పోయి మరింత పేదరికంలోకి నెట్టివేయబడ్డారని, వారు తిరిగి పూర్వస్థితికి చేరుకోవడానికి మరో పదేళ్లు పట్టవచ్చని అంచనావేసింది. పతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు ఆక్స్ఫామ్ సూచించింది. ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం ఆర్థికంగా చేయూతనివ్వాలని సూచించింది. ప్రపంచం పేదరిక నిర్మూలనపై దష్టి సారించాలని తెలిపింది. ప్రభుత్వ రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టాలని సూచించింది. విద్య, వైద్యం, సామాజిక రక్షణ కల్పించాలని తెలిపింది. పన్నుల ద్వారా సంపన్నులు ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించాలని తెలిపింది.