Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిడికెడంత మంది రైతులు.. వాళ్ళేంచేస్తారు : బీజేపీ
- గుప్పెడే.. ఇంతింతై వటుండతై కదనరంగంలోకి...
లక్నో : నల్లచట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఢిల్లీ సరిహద్దులకు వెళ్లకుండా ఇప్పటికే పలువురు రైతులపై యూపీ సర్కార్ ఎఫ్ఐఆర్లు పెడితే... తాజాగా గణతంత్ర దినోత్సవం రోజున కిసాన్ పరేడ్కు వెళ్లకుండా ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ట్రాక్టర్లు, బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ పొయొద్దనీ, ద్విచక్రవాహనాలపై మువ్వన్నెల జెండాలతో ప్రదర్శనలకు అనుమతించొద్దని ఆదేశాలిచ్చింది. కానీ మనం బ్రిటిష్ పాలనలో ఉన్నామా? 1947 తర్వాత జాతీయజెండా ఎగరేసుకుని స్వేచ్ఛ సంకెళ్లు తెంచుకుని బతుకుతున్నాం. మోడీ సర్కార్ వచ్చాక కార్పొరేట్లను వెనకేసుకుని వస్తున్నది. ఆ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పిడికెడంత మంది అన్నదాతలే అంటూ చులకనగా మాట్లాడినా బీజేపీ ప్రభుత్వంపై పిడికిలి బిగించి పోరుకు ట్రాక్టర్లతో సన్నద్ధమయ్యారు. ఒకటి కాదు రెండుసార్లు కాదు... ఏకంగా 11 సార్లు కేంద్రం చర్చలకు పిలిచి...రైతు బృందాల మధ్య చిచ్చుపెట్టాలని చేసిన యత్నాలు కాస్త బెడిసికొట్టాయి. దేశానికే అన్నంపెట్టే రైతన్నపట్ల చులకనభావంతో మాట్లాడటం.. చర్చలంటూ పిలిచి తొండాట ఆడుతున్న బీజేపీ ప్రభుత్వానికి దిమ్మతిరిగేలా షాక్ ఇవ్వాలని రైతన్న నిర్ణయించాడు. దీనికి ఉదాహరణే కార్పొరేట్ల కనుసన్నల్లో సేద్యం సాగేలా చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం షురూ అయి ఇప్పటికీ రెండు నెలలు దాటింది. అయినా వారిలో పోరాట పటిమ ఏ మాత్రం తగ్గలేదు. మహిళలు.. చిన్నారులు... వృద్ధులనే తేడాలేకుండా సత్తా చాటడానికి తరలివస్తూనే ఉన్నారు. ఇక మోడీ సర్కార్ ట్రాక్టర్ ర్యాలీపై ఆంక్షలు విధించినా... ఇప్పటికే లక్షకు పైగా ట్రాక్టర్లు సరిహద్దుకు చేరాయి.
కాశీ నుంచి కన్యాకుమారి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్నదాతలు నడుంబిగించారు. దేశ రాజధానిలోనే అడుగుపెట్టనీయమన్న ఢిల్లీ పోలీసులు వెనక్కి తగ్గకతప్పలేదు. బ్యారికేడ్లు పెట్టి... జలఫిరంగులు ప్రయోగించినా... రైతులు మడమతిప్పలేదు. నల్లచట్టాలు రద్దు చేయనంత వరకూ పోరాటం ఆగదని ప్రతినబూనారు.
మేమూ దేశభక్తులమే..
ప్రతీ భారతీయుడు దేశభక్తుడే. కానీ దేశం పచ్చగా ఉంటేనే అన్నింటా అభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతూనే ఉంటారు. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం రైతుల ఆందోళల్ని పట్టించుకోవటంలేదు. పంజాబ్ నుంచే కాదు. దేశంలోని పల్లె పట్టణం అనే తేడా తేకుండా.. పరేడ్లో భాగస్వామ్యం కావటానికి ఉత్సూకత ప్రదర్శిస్తున్నారు. సింఘు సరిహద్దులో దీక్షాస్థలిలో మొదలైనప్పటి నుంచి గణతంత్ర దినోత్సవానికి నిర్వహించే పరేడ్ వరకూ రైతులు అహింసా మార్గంలోనే శాంతియుత నిరసనలవైపే మొగ్గుచూపుతున్నారు. రైతుల పోరాటానికి స్ఫూర్తిగా నాసిక్ నుంచి ముంబయి వరకూ కాలిబాటన నడుచుకుంటూ ఆజాద్ మైదాన్ వరకు కొనసాగిన ఉద్యమతీరు అన్నదాతల్లో పోరాట పటిమకు నిదర్శనంగా నిలుస్తున్నది.
ఢిల్లీకి బయలుదేరిన అన్నదాతలను అడ్డుకోవటానికి యూపీ పోలీసులు అడ్డంకులు కల్పిస్తూనే ఉన్నారు. మువ్వన్నెల జెండాలతో వస్తున్న ట్రాక్టర్లను ఆపటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ రైతులు మాత్రం వెనక్కి తగ్గటంలేదు. సరిహద్దు ప్రాంతాలకు చేరుకునే అన్నదాతలు తమతో పాటు కొన్ని ఆహారవస్తువులు తీసుకోని రావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. గోడీ మీడియా రెచ్చగొట్టినా అన్నదాతలు సంయమనం పాటించాలని కోరుతున్నారు.
కిసాన్ ఆందోళన్లో అర్బన్ నక్సల్స్ చొరబడ్డారనీ కేంద్రమంత్రి పీయూశ్ గోయల్ అంటే.. బీజేపీ నేతలు రైతుల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలూ చేశారు. ఇలా అన్నదాతల్ని బదనాం చేసే పనిలో బీజేపీ విఫలయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అంతేకాదు సుప్రీంకోర్టుకు కేంద్రం ఇచ్చిన రిపోర్టులోనూ ఖలిస్థాన్ ఉగ్రవాదులు చొరబడ్డారనీ... ఎన్ని వాదనలు చేసినా సుప్రీం ఆ వాదనల్ని తిరస్కరించింది. తాము ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేదనీ..స్వచ్ఛందంగా పరేడ్లో పాల్గొనటానికి వస్తున్నామంటూ పలువురు రైతులు తెలిపారు.
కెనడా ప్రధాని మద్దతు
కిసాన్ పరేడ్కు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇటీవల కెనడాలోన ల్యాంగలే ప్రాంతంలో భారత రైతులకు మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 300 ట్రాక్టర్లు, వందలాది కార్లు 50 కిలోమీటర్ల వరకు జరిగిన ర్యాలీ పాల్గొన్నారు. కెనడాలో ఉంటున్న భారతీయలు పెద్ద ఎత్తున ఈ ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. స్థానికులంతా చిన్నా పెద్దా అనే తేడాలేకుండా నడుం బిగించారు. ఇండో కెనడీయన వర్కర్స్ అసోసియేషన్ సభ్యులూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు లభిస్తున్నది.