Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చమురు ధరల బాదుడుతో ఇంటి బడ్జెట్పై ప్రభావం
- పెరగని ఆదాయాలు.. భారమవుతున్న ఖర్చులు
- 291 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ అధ్యయనం
కోవిడ్-19కు ముందు... ఆ తర్వాత రోజులు గడవటం భారమవుతున్నది. పేద కుటుంబాలైతే ఉపాధి దొరక్క పస్తులుంటే.. పెద్దలు మాత్రం శతకోటీశ్వరులుగా పడగలెత్తారు. మోడీ ప్రభుత్వం ఎడాపెడా పెంచుతున్న చమురుధరల దెబ్బ.. మరోపక్క అదుపులేకుండా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు భీతిల్లిపోతున్నారు. దేశప్రజల బాగోగులు చూడాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. చమురు ధరల పెరుగుదలలో తన తప్పేమీ లేదంటూ బుకాయించే ప్రయత్నం చేస్తున్నది. సామాన్యులు ద్విచక్రవాహనాలను బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 'లోకల్ సర్కిల్స్' దేశవ్యాప్తంగా అధ్యయనం నిర్వహించింది. ఇందులో పెరగని ఆదాయాలతో బతికేదెలా అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
న్యూఢిల్లీ : సామాన్య, మధ్యతరగతి ప్రజలు వచ్చిన ఆదాయాన్ని లెక్కలేసుకొని ఖర్చు చేస్తుంటారు. ప్రతినెలా ఓ బడ్జెట్ తయారు చేసుకుంటాడు. ఇందులో ఇంటిఅద్దె, నిత్యావసరాలు, మందులు, ఇలా ఖర్చుల వారీగా లెక్కేసుకుంటాడు. అనుకోని ఖర్చులతో ఖర్చు అంచనాను దాటిపోతుంది. తప్పని పరిస్థితుల్లో చేబదులు తీసుకుంటారు. లేదా వడ్డీల కోసం తంటాలుపడతాడు. ఆ తర్వాత నెల రాగానే చేసిన అప్పులు తీర్చలేక అవస్థలు పడుతున్న కుటుంబాలెన్నో. ఇప్పుడు చమురుధరలు ఇష్టానుసారంగా పెంచేస్తుంటే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు తలలు పట్టుకుంటున్నాడు. వరుసగా ఆకాశాన్నంటున్న పెట్రో ధరలపై దేశంలోని 291 జిల్లాల్లో 22 వేలమందిని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ అధ్యయనం చేసింది. ఇందులో కొన్ని ఆసక్తికరఅంశాలు వెలుగు చూశాయి. అత్యవసర వస్తువులకు వెచ్చించే ఖర్చు, పొదుపునకు కోతపెడుతున్నట్టు పలువురు వెల్లడించారు. దేశంలో పెట్రో, డీజిల్ ధరలు ఊహించని రికార్డుల వైపు పరుగులు తీస్త్తున్నాయి. ప్రధాన నగరాల్లో పెట్రోల్ లీటర్ ధర సెంచరీ దాటేసింది.
ఖర్చు తగ్గించుకుంటున్న తీరు ఎలాగంటే...
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలను భర్తీ చేయడానికి అవసరమైన వస్తువులపై ఖర్చు తగ్గించుకుంటున్నట్టు సర్వేలో 21శాతం మంది చెప్పారు. 14 శాతం మంది తమ పొదుపును తగ్గించుకుంటున్నట్టు తెలిపారు.
52 రోజుల్లో 24 రెట్లు
ఫిబ్రవరి 21 నాటికి ఈ నెలలో పెట్రోల్, డీజిల్ రేట్లు... 14 రెట్లు పెరిగాయి. ఈ సమయంలో ఢిల్లీలో పెట్రోల్ రూ.4.03, డీజిల్ రూ.4.24 పెరిగింది. అంతకు ముందు జనవరిలో రేటు 10 రెట్లు పెరిగింది. పెట్రోల్ ధరను రూ .2.59, డీజిల్ రూ .2.61 పెంచారు. ఇక 2021లో అడుగుపెట్టాక..పెట్రో ధరలు 52 రోజుల్లో 24 రెట్లు పెరిగాయి. పెట్రోల్ ధర రూ .6.77, డీజిల్ రూ .7.10 పెరిగింది.
13 నెలల్లో చమురుధరలు పెరిగినా..
13 నెలల్లో ముడిచమురు ధరలు 23 శాతం పెరిగాయని కేంద్రం వాదన. జనవరి 1న బ్రెంట్ కూడ్ర్ ఆయిల్ ధర 51 డాలర్లు, ఇపుడు 63 డాలర్లు. అయినా 2014లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్లు ఉన్నా...70లు కూడా మించలేదు. మరి ఈ బాదుడెందుకని సామాన్యుడు మోడీ సర్కార్ను అడుగుతున్న ప్రశ్న.
అసోం, పశ్చిమబెంగాల్లో స్వల్ప ఊరట
సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించడానికి పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. పశ్చిమ బెంగాల్ మమతా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు ఒక్కరూపాయి తగ్గించింది. అసోంలో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు ఐదు రూపాయలు తగ్గించింది.
కేంద్రం ఏమంటుందంటే...
ఇంధనధరల పెంపు విషయంలో.. మేం ఏ నిర్ణయం తీసుకున్నా.. అందుకు బాధ్యత వహిం చాల్సిందే అన్నట్టుగా కేంద్రం వ్యవహరి స్తున్నది. అంతేకాదు.. బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడేండ్ల యిన తర్వాత కూడా పెట్రో ధరల పెరుగు దలకు కాంగ్రెసే కారణమని మోడీ ఇటీవల వ్యాఖ్యానిం చారు. ధరలను వ్యతిరేకిస్తే ఎలాంటి తలనొప్పులు వస్తాయోనన్న భయం అందరిలోనూ నెలకొన్నది. వరుసగా 12 రోజులపాటు బాదిన మోడీ సర్కార్.. ఏ క్షణాన్నయినా మీకు వాయింపు తప్పదన్న సంకేతా లిస్తూనే ఉన్నది. పెట్రోధరలు ఇంకెంతగా పెరుగుతా యోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతున్నది.