Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్మీ పరీక్ష రద్దు కేసులో పలువురు అరెస్టు
న్యూఢిల్లీ : ఆర్మీలో జనరల్ డ్యూటీ సిబ్బంది కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన నియామకానికి సంబంధించి ప్రశ్నపత్రం లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆదివారం జరగాల్సిన పరీక్షను రద్దు చేశారు. అయితే ప్రశ్నపత్రం లీకేజ్పై ఇండియన్ ఆర్మీలోని 'మిలిటరీ ఇంటెలిజెన్స్', పూణె క్రైం బ్రాంచ్ పోలీసులు సంయుక్త విచారణ జరుపుతున్నారు. ప్రశ్న పత్రం లీకేజ్తో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇద్దరు ఆర్మీ మాజీ ఉద్యోగుల్ని, రక్షణశాఖలో పనిచేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం పలు జిల్లాల్లో అనుమానితుల ఇండ్లల్లో సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ముందు ముందు మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశముందని పోలీస్ ఉన్నతాధికారులు తెలియజేశారు.
''వాట్సాప్లో పంపిణీ అయిన ప్రశ్న పత్రం, అసలు ప్రశ్నపత్రం పోల్చిచూడగా రెండూ ఒకటేనని తేలింది. ఈనేపథ్యంలోనే అధికారులు పరీక్షను రద్దుచేశారు. పూణె, చుట్టుపక్కల జిల్లాల్లో వేలాది మంది ఈ పరీక్షకు హాజరుకాబోతున్న తరుణంలో రద్దు అయ్యింది. ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ కొత్త తేదీ ప్రకటించి, పరీక్షను నిర్వహిస్తుంది'' అని ఆర్మీ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. 2017లోనూ ఇలాగే ఆర్మీ రిక్రూట్మెంట్ పరీక్ష లీక్ కావడంతో రద్దు చేశారు. ఈసారి జరిగిన లీకేజ్ వ్యవహారంలో కొంతమంది అభ్యర్థుల నుంచి రూ.2 నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేశారని, తద్వారా వారికి పరీక్ష పత్రం ముందుగా అందే ఏర్పాట్లు చేశారని తెలిసింది. కొంతమంది అభ్యర్థుల నుంచి ఒరిజనల్ అర్హతా పత్రాలు తీసుకున్నారని, పరీక్ష, తుది ఎంపికలో చోటు కల్పించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చి డబ్బులు వసూలు చేసినట్టు పూణె పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.