Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ సంతాపం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.కృష్ణన్ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది. దీంతో కేరళలోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటన్న ఆయన పరిస్థితి విషమించి ఆదివారం మరణించారు. కృష్ణన్ మృతిపై సీఐటీయూ సోమవారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మరణం దేశ కార్మికోద్యమానికే తీరని లోటని పేర్కొంది. 1974లో పోస్టల్ సర్వీస్లో చేరిన కృష్ణన్ కార్మిక సంఘ కార్యకలాపాల్లో తొలి నుండి చురుగ్గా పాల్గొనేవారు. అఖిల భారత పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ (గ్రూప్-సి), జాతీయ పోస్టల్ ఉద్యోగుల సమాఖ్య (ఎన్ఎఫ్పీఈ), సీసీజీఈడబ్ల్యూల్లో 1976 నుంచి బ్రాంచ్ కార్యదర్శి నుంచి పలు పదవులకు ఎన్నికవుతూ వచ్చారు. సర్కిల్ నుంచి జాతీయ స్థాయి వరకు అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారు. దాడులు, దారుణాలను సమర్ధవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమ ప్రమఖుల్లో ఒకరైన కృష్ణన్ గత నాలుగున్నర దశాబ్దాల కాలంలో చురుకైన కార్మికోద్యమ జీవితాన్ని గడిపారు. కార్మికుల ఐక్య పోరాటాల్లో ఉద్యోగుల ఉద్యమాన్ని అంతర్గత భాగంగా చేశారు. పలు అంతర్జాతీయ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.