Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కరోనా వైరస్ వాక్సినేషన్ పెరుగుతుండటంతో కేసుల సంఖ్య తగ్గుతోన్నప్పటికీ.. ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతున్నప్పటికీ .. ప్రయివేటు పెట్టుబడులు డీలాగానే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఓ రిపోర్ట్లో తెలిపింది. వినిమయం రికవరీ పుంజుకునే దశలో ఉందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ రికవరీలో అన్ని కార్యకలాపాల (ఇంజిన్లు) డిమాండ్లు పెరిగినప్పటికీ.. ప్రయివేటు పెట్టుబడులు మాత్రం పెద్దగా కానరావడం లేదని ఆర్బిఐ ఫిబ్రవరి మాసం బులిటెన్లో పేర్కొంది. 2020 అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో జిడిపి సానుకూల వృద్థిని నమోదు చేసిందని గుర్తు చేసింది. ఈ త్రైమాసికంలో జిడిపి 0.4 శాతం పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 7.3 శాతం, జూన్ త్రైమాసికంలో 24.4 శాతం చొప్పున జిడిపి క్షీణించిన విషయం తెలిసిందే.
దేశీయ పెట్టుబడులకు అవకాశమివ్వాలి : బిర్లా
కరోనా సంక్షోభంతో దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోయిన నేపథ్యంలో భారత కంపెనీలకు అవకాశాలు పెరిగేలా చూడాలని ఆదిత్యా బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమర్ మంగళం బిర్లా అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే దేశీయ కంపెనీల పెట్టుబడులకు ప్రాధాన్యత, అవకాశాలు కల్పించాలని ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. కరోనా సంక్షోభంలోనూ తమ కంపెనీ దాదాపుగా రూ.21వేల కోట్లు (2.8 బిలియన్ డాలర్ల) పెట్టుబడులను ప్రకటించిందన్నారు.