Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం గత మూడు నెలలుగా సాగిస్తున్న చారిత్రాత్మక పోరాటానికి దేశీయంగానే గాక అంతర్జాతీయంగా కూడా మద్దతు మరింత పెరుగుతోంది. తాజాగా కెనడాతోపాటు బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, నెదర్లాండ్, జర్మనీ, దక్షిణాఫ్రికా, నార్వే దేశాలకు చెందిన కార్మిక, పౌర సంఘాలు భారత రైతాంగ ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రైతులు, లేదా వారి ప్రతినిధులను సంప్రదించకుండానే ఈ కొత్త చట్టాలను రూపొందించినట్టు తెలిపాయి. కొన్ని దశాబ్దాలుగా పలు ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న హామీలకు నూతన చట్టాలు వ్యతిరేకంగా ఉన్నందున వారు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొంది. కార్పొరేట్లకు అనుకూలంగా ఉన్న ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, అదేవిధంగా విద్యుత్ బిల్లు, రైతులపై విధించదలచుకున్న కాలుష్య జరిమానాలను ఉపసంహరించుకోవాలని కార్మిక, పౌర సంఘాలు తమ ప్రకటన ద్వారా మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. స్వామినాధన్ కమిషన్ సిఫారసులు చేసిన విధంగా వ్యవసాయ ఉత్పత్తులకు సి2 ప్లస్ 50శాతం విధానంలో కనీస మద్దతు ధరను ఇవ్వాలనీ, ఎంఎస్పీపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
ఈ వివాదాస్పద వ్యవసాయ చట్టాలు రైతులకు హాని కలిగించడంతో పాటు కార్పొరేట్లకు లబ్ది చేకూరుస్తాయని సంఘాలు పేర్కొన్నాయి. రైతులు చేస్తున్న డిమాండ్లకు పరిష్కారాన్ని చూపకుండా.. ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న వారిపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడే సంఘాలుగా తాము ఈ ప్రకటన విడుదల చేస్తున్నామని కార్మిక, పౌర సంఘాలు పేర్కొన్నాయి. అటువంటి హక్కులపై ఎక్కడ దాడి జరిగినా, అది తమపై జరిగినట్టుగా భావిస్తామని తెలిపాయి. రైతులు తమ ప్రాణాలను పణంగా పెట్టి భారత ప్రజలందరి తరపున రాజ్యాంగపరమైన హామీలను సాధించేందుకు పోరాడుతున్నారనీ, దీన్ని ప్రపంచమంతా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. రైతుల ధీరత్వం, వారి త్యాగానికి మా మద్దతు తెలుపుతున్నామని సంఘాలు పేర్కొన్నాయి.