Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరుపతి ఎయిర్పోర్టులో పోలీసులఅడ్డగింత
తిరుపతి : కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులు, దాడులపై నిరసన తెలిపేందుకు సోమవారం తిరుపతి వచ్చిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును చిత్తూరు జిల్లా తిరుపతి ఎయిర్పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, ప్రభుత్వం తీరుకు నిరసనగా చంద్రబాబు ఎయిర్పోర్టులో నేలపై బైఠాయించారు. సుమారు తొమ్మిది గంటలపాటు అక్కడ నిరశన దీక్ష చేపట్టారు. తిరుపతి, చిత్తూరుల్లోని గాంధీ విగ్రహాల వేదికగా నిరసన దీక్ష చేపట్టేందుకు సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఉదయం 9.30 గంటలకు విమానంలో తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. కోవిడ్ నిబంధనలు ఉన్నాయంటూ, ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ, నిరసన దీక్షకు అనుమతి లేదంటూ చంద్రబాబును పోలీసులు ఎయిర్పోర్టులోనే అడ్డుకున్నారు. 'వైసీపీ అక్రమాలు చేస్తుంటే ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రశ్నించే హక్కు లేదా? శాంతియుతంగా గాంధీ విగ్రహాల వద్ద దీక్ష చేపడితే మీకేంటి? ఎన్నికల కమిషన్ వద్ద అనుమతి తీసుకునే వచ్చాను' అని చంద్రబాబు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. 14 ఏండ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన తనకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి, చిత్తూరుల్లో జరగాల్సిన దీక్షకు అనుమతించకపోతే తాను ఇక్కడే దీక్ష చేపడతానంటూ ఎయిర్పోర్టు లాంజ్లో నేలపై బైఠాయించారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మంచినీరు కూడా తాగకుండా నిరశన దీక్ష చేపట్టారు. వయస్సు రీత్యా దీక్ష చేపట్టడం ఆరోగ్యానికి మంచిది కాదని పోలీసులు బతిమిలాడారు. అల్పాహారమైనా తీసుకోవాలని కోరారు. ఇందుకు చంద్రబాబు నిరాకరించారు. ఎయిర్పోర్టులో చంద్రబాబు నిరశన దీక్షతో దాదాపు తొమ్మిది గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయినా, పోలీసులు ఆయనను ఎయిర్పోర్టు నుంచి బయటకు పంపలేదు. దీంతో, ఇండిగో విమానంలో చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే చంద్రబాబుకు నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించినట్టు పోలీసులు తెలిపారు.