Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైలో వ్యాక్సిన్ వేసుకున్న ఉపరాష్ట్రపతి
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కరోనా వ్యాక్సిన్ రెండో దశ ప్రక్రియ సోమవారం ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని మోడీ కూడా భారత బయోటిక్ రూపొందించిన కోవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకున్నారు. 60 ఏండ్లు పైబడిన వారితో పాటు 45 నుంచి 59 ఏండ్ల లోపు వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ ఎయిమ్స్లో పీఎం మోడీ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాగా, ఆయనకు పుదుచ్చేరి కేంద్ర ప్రాలిత ప్రాంతానికి చెందిన నర్సు పి. నివేద, ఆమెతో పాటు కేరళకు చెందిన మరో నర్సు రోసమ్మ అనిల్ టీకా వేశారు. తాను తొలి డోసు వ్యాక్సిన్ పొందినట్టు ప్రధాని మోడీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. కరోనాపై మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని మోడీ కొనియాడారు. అర్హులందరూ కరోనా టీకా వేసుకోవాలని అందరని కోరారు. మనమంతా భారత్ను కరోనా లేని దేశంగా తీర్చిదిద్దుదామన్నారు. దేశంలో ప్రస్తుతం రెండు వ్యాక్సిన్ల వినియోగంలో ఉన్న విషయం తెలిసిందే. పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవిషీల్డ్తో పాటు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రధాని మోడీ కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు.
ఇదీ ఎన్నికల స్టంటేనా... మోడీజీ : సోషల్ మీడియాలో చర్చ
భారత్ బయోటిక్ రూపొందించిన వ్యాక్సిన్ వేసుకునే క్రమంలో ఉపయోగించుకున్న వైద్య సిబ్బందిని కూడా ప్రధాని మోడీ తన ఎన్నికల ప్రచారానికి వినియోగించుకున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న రెండు రాష్ట్రాలైన పుదుచ్చేరి, కేరళకి చెందిన ఉద్యోగులను తన వ్యాక్సిన్ సందర్భంలో వాడుకొని ఒక సంతుష్టీకరణ(అప్పీజ్మెంట్)కి మోడీ పాల్పడ్డారని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లలో సంభాషణలు జరుగుతున్నాయి. పీఎం మోడీ ప్రచారానికి ఎంతటికి దాన్ని అయినా తన ప్రచారానికి వాడుతారని పోస్టుల వరద కొనసాగుతుంది. అయితే, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రెండో డోసుకి వారిని కూడా వాడతారా? అంటూ కొన్ని ప్రశ్నించే కామెంట్లు రావడం ప్రత్యేకంగా చెప్పుకొవాల్సిన విషయం. దాంతోపాటు, ఇతర దేశాధినేతలు ఎప్పుడు వేసుకున్నారు... మీరు ఎప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నారు మోడీ అంటూ మరికొందరు నిలదీయడం గమనార్హం. అంటే మీరు అనుమతి ఇచ్చిన వ్యాక్సిన్ వేసుకునేందుకు మీకే నమ్మకం లేదా? పశ్న్రిస్తున్నారు.
చెన్నైలో ఉపరాష్ట్రపతి
మహమ్మారి కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కోవిడ్-19 వ్యాక్సిన్ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చెన్నైలో తీసుకున్నారు. గత మూడు రోజులుగా తమిళనాడులో పర్యటిస్తున్న ఆయన సోమవారం ఉదయం చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటుచేసిన కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కాగా, ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు.
నేటి నుంచి సుప్రీంకోర్టు జడ్జిలు
రెండో విడత కార్యక్రమంలో భాగంగా భారత సర్వోన్నత న్యాయస్థానం జడ్జిలు నేటి(సోమవారం) నుంచి కరోనా వ్యాక్సిన్లు వేయించుకోనున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లని చేసినట్టు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ మీడియాకి వెల్లడించింది. ముందుగా జడ్జిలు, వారి కుటుంబ సభ్యులు అనంతరం న్యాయ స్థాన సిబ్బందికి వేయనున్నట్టు స్పష్టం చేసింది.