Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత పంచాయతీల ప్రజాప్రతినిధుల తీర్మానం
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్న రైతులకు మద్దతుగా నిలవాలని పలు దళిత పంచాయతీల ప్రతినిధులు ప్రమాణం చేశారు. కాన్స్టిట్యూషన్ క్లబ్ వద్ద దళిత కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దళితులు, రైతులు.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఐక్యంగా పోరాటం చేస్తారని ప్రజాప్రతినిధులు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి కారణంగానే దళితులు ఈ చర్యకు ఉపక్రమించారని ఉదిత్ రాజ్ చెప్పారు. ప్రభుత్వ నియంతృత్వాన్ని రైతుల ఉద్యమం మాత్రమే ఆపగలదనీ, దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ ఉద్యమానికి సెల్యూట్ చేయాలని ఆయన కోరారు. కాగా, వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం, ప్రభుత్వ ఆస్థుల అమ్మకానికి ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ సమావేశంలో ముఖ్యంగా నాలుగు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తామని ఆయన చెప్పారు. కాగా, దాదాపు మూడునెలలుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు దేశంలో అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్న విషయం విదితమే.