Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం జగన్మోహన్రెడ్డి
అమరావతి : ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్ తరహ సేవలందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆస్పత్రులకు సంబంధించిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు కార్యక్రమంపై మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో అభివృద్ధి, కొత్త కళాశాలల నిర్మాణాలు జరుగుతున్న తీరును అడిగితెలుసుకున్నారు. కళాశాల నిర్మాణాల్లో ఎక్కడైనా భూ సేకరణ సమస్య వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఉత్తమ వైద్యం, ఉత్తమ నిర్వహణ, ఉత్తమ ప్రమాణాలు పాటించడమే ప్రభుత్వ ఆస్పత్రుల లక్ష్యం కావాలన్నారు. ఆస్పత్రుల్లో పరికరాలు పనిచేయడం లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. కొత్త ఆస్పత్రుల నిర్మాణం ఎంత ముఖ్యమో నిర్వహణ కూడా అంతే ముఖ్యమన్నారు. ఎంత మంది వైద్యులు అవసరమో తంతమందినీ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 10,011 హెల్త్ క్లినిక్ల నిర్మాణం, 1426 క్లినిక్ల అభివృద్ధి పనులు సెప్టెంబరు నాటికి పూర్తి కావాలని ఆదేశించారు. మార్చి నెలాఖరు కల్లా వైద్యకళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ, వాటి చెల్లింపులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ మే 15 కల్లా కొత్తగా నిర్మించనున్న అన్ని కళాశాలల టెండర్లూ పూర్తి చేస్తామన్నారు. కొత్త పిహెచ్సిల నిర్మాణానికి స్థలాలు ఎంపిక పూర్తయిందని అక్టోబరు నాటికి ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధి, కొత్త వాటి నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో పనులు డిసెంబరు నాటికి పూర్తయ్యేలా ముందుకెళ్తున్నామని సిఎం దృష్టికి తీసుకొచ్చారు. కోవిడ్ పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్రంలో 69 ఆస్పత్రుల్లో 9,265 బెడ్లు ఇంకా అందుబాటులోనే ఉన్నాయని వివరించారు. ఈ సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సిఎస్ ఆదిత్యనాథ్దాస్, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్, కమిషనర్ కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.