Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛత్తీస్గఢ్ ప్రభుత్వం
ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలో గత పది నెలల్లో 141 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఛత్తీస్గడ్ ప్రభుత్వం అసెంబ్లీలో వెల్లడించింది. ఇది గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకున్న సమాచారమని తెలిపింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ధరమ్లాల్ కౌశిక్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి రవీంద్ర చౌబే ఈ సమాధానాన్ని వెల్లడించారు. కాగా, ప్రభుత్వ సమాధానంపై సంతృప్తి చెందని ప్రతిపక్ష పార్టీ బీజేపీ.. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. కాగా, ఛత్తీస్గఢ్.. రైతుల రాష్ట్రమా? లేక రైతులను చంపే రాష్ట్రమా? అని కౌశిక్ అన్నారు. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి అన్ని కేసుల్లోనూ దర్యాప్తునకు ఆయన డిమాండ్ చేశారు. అయితే, రైతుల ఆత్మహత్యలను బీజేపీ రాజకీయం చేస్తున్నదని చౌబే అన్నారు. బీజేపీ గత పాలనలోనూ రైతుల ఆత్మహత్యలు జరిగాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీంతో ఇరు పార్టీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.