Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్కడికక్కడ నిలిచిన అన్ని వాహనాలు
తిరువనంతపురం : కేంద్రంలో మోడీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సెంచరీ కొడుతోంది. మరోవైపు ఎల్పిజి సిలిండర్ కూడా నిరంతరంగా వడ్డన చేస్తోంది. ఇప్పటికే కరోనా సంక్షోభ ప్రభావంతో జీవనం కష్టతరంగా మారిన సామాన్యుడికి ఈ థరల పెరుగుదల మరింత పెనుభారంగా మారింది. పెట్రో ధరల పెరుగుదలకు సంబంధించి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా కేరళలో మంగళవారం కార్మిక సంఘాల సంయుక్త కమిటీ పిలుపుమేరకు రవాణా సమ్మె జరిగింది. సమ్మె ప్రారంభమైన ఉదయం 6 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టిసి బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు, ఇతర రవాణా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కెఎస్ఆర్టిసి బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. మరోవైపు ట్రక్కులు, లారీలతో సహా వాణిజ్య వాహనాలన్నీ కూడా సమ్మెకు సంఘీభావంగా రోడ్లపక్కనే నిలిచిపోయాయి. దీంతో సాధారణ జనజీవనం స్థంభించింది. రవాణా సమ్మె కారణంగా రాష్ట్రంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనించగా, దుకాణాలు కూడా మూసివేశారు.
పెరుగుతున్న ఇంధర ధరలతో వస్తువుల రవాణా, ప్రయాణికులకు రవాణా ఛార్జీలు భారంగా మారతాయని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. సమ్మెలో ప్రధానంగా సిఐటియు, ఐఎన్టియుసి పాల్గొనగా, బిజెపి అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ మాత్రం దూరంగా ఉంది. సమ్మె ప్రభావంతో మంగళవారం జరగాల్సిన ఎస్ఎస్ఎల్సి, ప్లస్ టూ, విహెచ్ఎస్సి పరీక్షలను 8వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. అలాగే ఎపిజె అబ్దుల్ కలాం టెక్నాలజీ యూనివర్శిటీతో పాటు కేరళ, కొచి, కన్నూర్, మహత్మా గాంధీ యూనివర్శిటీలు మంగళవారం జరగాల్సిన తమ పరీక్షలన్నీ వాయిదా వేశాయి.