Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం
లక్నో : యూపీలో చెరుకు రైతులు ప్రభుత్వ తీరు పట్ల విసుగుచెందారు. చెరుకు పంటకు సరైన ధర కల్పించకపోవడం, వీధి పశువులు సమస్యలపై ముజఫర్నగర్ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. '' చెరుకు ధరల పెంపు గత కొన్ని సీజన్ల నుంచి జరగడంలేదు. మరోపక్క కంపెనీలు యూరియా, డీఏపీ బ్యాగుల సైజును తగ్గించాయి. దీంతో పంట ఉత్పత్తికి ఖర్చు అధికమై, వ్యవసాయం పడకేసింది'' అని సతేరీ గ్రామానికి చెందిన కుమార్ అనే రైతు వాపోయాడు. '' జీవితంలో సంపాదించడానికి వ్యవసాయం ఒక మంచి మార్గమని ఒప్పుడు చెప్పుకునేవాళ్లం. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది'' అని కుమార్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. పశ్చిమ యూపీకి చెందిన ముజఫర్నగర్.. దేశరాజధాని ఢిల్లీకి ఎంతో దూరంలోనూ లేదు. మూడు వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న నిరసన ప్రదేశాలకు దగ్గరలోనే ఈ ప్రాంతం ఉన్నది. అయితే, కేంద్రం తెచ్చిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల కంటే.. రాష్ట్రంలో చెరుకు సమస్యలపై ముజఫర్నగర్ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్నదనీ, వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల నిరసనలకు తాను మద్దతు తెలుపుతున్నానని కుమార్ చెప్పారు. కాగా, రాష్ట్రంలో ఏ చెరుకు రైతును కదిల్చినా ఇవే బాధలను వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద వ్యవసాయ చట్టాల కంటే ఎక్కువ కష్టాలను తాము అనుభవిస్తున్నామనీ రోషన్లాల్ అనే మరో రైతు వాపోయాడు. గత కొన్నేండ్లుగా చెరుకు బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం, డీజీల్ ధరల పెంపు, వీధి పశువుల సమస్యలతో రైతుల జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆయన అన్నారు.
కాగా, ఈ ప్రాంతంలో చెరుకు పంట రైతులకు ప్రధాన ఆదాయ వనరు. ఆలిండియా షుగర్ ట్రేడర్స్ అసోసియేషన్ (ఏఐఎస్టీఏ) సమాచారం ప్రకారం.. 2020-21 సీజన్లో క్వింటాల్ చెరుకుకు రూ.285గా ఉన్నది. ఈ ప్రాంతంలో దాదాపు 50 షుగర్ మిల్లులు ఉన్నాయి. అయితే, తమకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రం షుగర్ మిల్లులు ఇప్పటికీ వెల్లడించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెక్టారుకు సగటున రూ. 2 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్న తమకు వ్యవసాయం లాభాన్ని చేకూర్చడంలేదని చెప్పారు.