Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కాలంలో తెరపైకి..
- అదానీ, అంబానీ సంపద పరుగు: హురున్ జాబితాలో వెల్లడి
- హైదరాబాద్ నుంచి 10 మంది..
న్యూఢిల్లీ : భారత్లో మోడీ ప్రభుత్వ విధానాల దెబ్బకు మెజారిటీ ప్రజలు కొనుగోలు శక్తి, ఆదాయాలను కోల్పోతుంటే మరోవైపు అపర కుబేరులు అమాంతం పెరిగిపోతున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలోనూ దేశంలో కొత్తగా 40 మంది కుబేరులు పుట్టుకొచ్చారని తాజాగా ఓ రిపోర్ట్లో వెల్లడైంది. దీంతో దేశంలో మొత్తం శతకోటీశ్వరుల సంఖ్య 177కి చేరింది. మంగళవారం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 ధనవంతుల జాబితాను విడుదల చేశారు. దీని ప్రకారం భారత్లో మొత్తం 209 మంది బిలియనీర్లు ఉన్నారు. వీరిలో 177 మంది ప్రస్తుతం దేశంలో నివసిస్తున్నారు. గతేడాది కాలంలో కొత్తగా పుట్టుకొచ్చిన బిలియనీర్ల విషయంలో అమెరికాతో భారత్ పోటీ పడింది. అమెరికాలో మొత్తం 69 మంది కొత్తగా బిలియనీర్ల జాబితాలో చేరగా.. భారత్లో ఈ సంఖ్య 40 పెరిగింది. దీంతో దేశంలో ప్రతీ వారానికి ఓ కుబేరుడు పుట్టుకొస్తున్నాడని స్పష్టమవుతోంది. ప్రపంచ బిలియనీర్లు గత సంవత్సరంలో జర్మనీ యొక్క స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో సమానంగా 3.5 ట్రిలియన్ డాలర్ల సంపదను పోగు చేసుకున్నారు. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021 జాబితాను ప్రపంచంలో 68 దేశాలలో ఉన్న 2,402 కంపెనీలు, 3228 బిలియనీర్లను పరిగణనలోకి తీసుకుని విడుదల చేశారు. గతేడాది 412 మంది బిలియనీర్లు ప్రపంచ వ్యాప్తంగా పుట్టుకొచ్చారు.
ఈ రిపోర్ట్ ప్రకారం.. గుజరాత్కు చెందిన ఇద్దరు బడా కార్పొరేట్లు అదానీ, అంబానీల ఆదాయం గత కొన్ని సంవత్సరాలుగా భారీగా పెరిగింది. ముకేశ్ అంబానీ మొత్తం సంపద గతేడాది కాలంలో 24 శాతం పెరిగి 83 బిలియన్ డాలర్లకు (సుమారు రూ .6.09 లక్షల కోట్లు) చేరుకున్నది. గౌతమ్ అదానీ కుటుంబం ఆదాయం రెట్టింపై రూ.2.34 లక్షల కోట్ల సంపదతో 48వ స్థానానికి చేరారు. తర్వాత స్థానంలో శివ నాడర్ కుటుంబం రూ.1.94 లక్షల కోట్ల సంపదతో 58వ స్థానం, లక్ష్మి ఎన్ మిట్టల్ రూ.1.40 లక్షల కోట్ల సంపదతో 104వ స్థానం, సీరం ఇన్స్టిట్యూట్ అధిపతి సైరస్ పూనావాలా రూ.1.35 లక్షల కోట్లతో సంపదతో 113వ స్థానంలో నిలిచారు.
టాప్లో ఎలన్ మాస్క్..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ నిలిచారు. గత ఏడాది కాలంలో ఆయన సంపద 328 శాతం పెరిగి 197 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క సంవత్సర కాలంలో ఆయన సంపద ఏకంగా 151 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 189 బిలియన్ డాలర్ల నికర విలువతో రెండవ స్థానంలో ఉన్నారు. ఎల్విఎంహెచ్ మోయిట్ హెన్నెస్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 114 బిలియన్ డాలర్ల నికర విలువతో 3వ స్థానంలో, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 110 బిలియన్ డాలర్లతో 4వ స్థానంలో, ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్బర్గ్ 101 బిలియన్ డాలర్ల సంపదతో 5వ స్థానంలో నిలిచారు.
హైదరాబాద్ నుంచి 10 మంది..
హరూన్ అంతర్జాతీయ జాబితాలో హైదరాబాద్కు చెందిన 10 మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఫార్మా రంగం నుంచి కాగా మిగిలిన ముగ్గురు మౌలిక వసతులు, నిర్మాణ రంగానికి సంబంధించిన వారు. వీరిలో దివీస్ ల్యాబోరేటరీస్ అధిపతి మురళి దివీ రూ.54,100 కోట్ల ఆదాయంతో భారత్లో 20వ స్థానం, ప్రపంచవ్యాప్తంగా 385వ స్థానంలో నిలిచారు.
పేరు కంపెనీ ఆదాయం రూ.కోట్లలో భారత్లో స్థానం ప్రపంచ స్థానం
మురళి దివీ దివీస్ ల్యాబోరేటరీస్ రూ.54,100 కోట్ల 20 385
పివి రాంప్రసాద్ రెడ్డి అరబిందో ఫార్మా రూ.22,600 కోట్లు 56 1,096
బి. పార్ధసారథి రెడ్డి హెటిరో డ్రగ్స్ 16 వేల కోట్లు 83 1,609
కె. సతీశ్రెడ్డి డాక్టర్ రెడ్డీస్ 12,800 కోట్లు 108 2,050
జిబి ప్రసాద్ కుటుంబం డాక్టర్ రెడ్డీస్ 10,700 కోట్లు 133 2,238
పి. పిచ్చి రెడ్డి మేఘా ఇంజినీరింగ్ 10,600 కోట్లు 134 2,383
రామేశ్వర్రావు జూపల్లి మై హోం ఇండిస్టీస్ 10,500 కోట్లు 138 2,383
పివి కష్ణారెడ్డి మేఘా ఇంజినీరింగ్ 10,200 కోట్లు 140 2,383
ఎం. సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ఎన్ ల్యాబ్ 9,800 కోట్లు 143 2,530
విసి నన్నపనేని నాట్కో ఫార్మా 8,600 కోట్లు 164 2,686