Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్టాలు రద్దు చేసే వరకు సమరమే...
- ఎంఎస్పీ సీ2+50 సాధించేందుకు కార్యాచరణ : ఢిల్లీలో జాతీయ కార్మిక, కర్షక సంఘ నేతల సంయుక్త సమావేశం
- మరోసారి మూతపడిన ఘాజీపూర్ సరిహద్దు
- 97వ రోజుకు చేరిన ఆందోళన
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో:
కేంద్రంలోని మోడీ సర్కారు ఆమోదించుకున్న సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంపై మోడీ సర్కారు అలసత్వం నేపథ్యంలో కర్షక పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని కర్షకులు నిర్ణయించారు. ఉద్యమ కార్యాచరణపై జాతీయ కార్మిక, కర్షక సంఘాల నేతలు దేశ రాజధానిలో మంగళవారం భేటీ అయ్యారు. ప్రత్యేకంగా జరిగిన ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ, రానున్న రోజుల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, పంథాపై నేతలు చర్చించారు. సాగు చట్టాలను తక్షణమే రద్దు చేసి, ఉద్యమిస్తున్న రైతు సంఘాలతో మోడీ సర్కారు చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇచ్చేలా చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 2014 ఎన్నికల ప్రచార సందర్భంగా మోడీ ఇచ్చిన హామీ ఎంఎస్పీ సీ2+50 ఇవ్వాల్సిందేనని
సమావేశంలో తీర్మానం చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్ల, కృష్ణ ప్రసాద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్, సంయుక్త కార్యదర్శి ఏఆర్ సింధూ, ఐఎన్టీయూసీ అధ్యక్షులు సంజీవరెడ్డి, అశోక్ సింగ్, ఏఐటీయూసీ అమర్జీత్ కౌర్, రైతు స్వాభిమాన్ వేదిక నేత యోగేంద్ర యాదవ్, సంయుక్త కిసాన్ మోర్చ (ఎస్కేయూ) నేతలు బల్దేవ్ సింగ్ నిహాల్దార్, ఆర్కే శర్మ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు కేంద్రం ఎందుకు చర్చించటంలేదు?
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారనీ, మరి అదే విషయంపై ఇటు రైతు సంఘాలతో అటు రైతులతో కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చించటంలేదని కార్మిక, కర్షక సంఘాలు ప్రశ్నించాయి. రైతులు ఇన్ని రోజులుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వం మళ్ళీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించాయి. మనమంతా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక ఏదైనా నిరంకుశ రాజ్యంలో ఉన్నామా? అని నిలదీశాయి. ఇప్పటికైనా చట్టాలు రద్దు చేసి, ఎంఎస్పీ విషయంలో ప్రభుత్వ వైఖరి ఏంటో రైతు సంఘాలతో చర్చలు చేయాలని డిమాండ్ చేశాయి.
లేబర్ కోడ్లపైనా రైతాంగ తరహా పోరాటం : తపన్ సేన్, సీఐటీయూ
ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరించటంతో పాటు, లేబర్ కోడ్ బిల్లులను అప్రజాస్వామికంగా ఆమోదించుకోవడంపై రైతాంగ తరహా ఉద్యమం చేస్తామని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ వెల్లడించారు. కార్మిక సంఘాల డిమాండ్లు పరిశీలించకుండానే ఆ బిల్లులను పార్లమెంట్లో ఆమోదించుకున్నారని అన్నారు. కార్మికులను ఇంతస్థాయిలో చిన్నచూపు చూసిన ప్రభుత్వాలు గతంలో తామేప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ నేషనల్ లేబర్ కాన్ఫరేన్స్(ఐఎల్ఓ) సిఫార్సలను కూడా మోడీ సర్కారు పరిగణనలోకి తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్టుబడిదారుల కోసం కార్మిక చట్టాల్లో ఇప్పటికే ఎన్నో సవరణలు చేశారనీ, ప్రస్తుతం కార్మిక చట్టాలనే రద్దు చేయడం ఆందోళనకరమన్నారు. చిన్న, మధ్య, భారీ పరిశ్రమల్లో పని చేస్తున్న కార్మికులకు సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు చట్ట ప్రకారం అమలు జరపాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులను బెదిరిస్తే పోరాటం ఆగదు : హన్నన్ మొల్లా, ఏఐకేఎస్
రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఢిల్లీ పోలీసులు బెదిరించడం, వేధించే ధోరణి అవలంభించినా అన్నదాతల పోరాటం ఎంతమాత్రం ఆగదని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) ప్రధాన కారదర్శి హన్నన్ మొల్లా పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో ఇప్పటికీ 248 మృతి చెందారనీ, వందలాదిపై కేసులు నమోదు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క కేసు కూడా కోర్టులో నిలవడం లేదనీ, అదే ప్రభుత్వ వేధింపుకలకు నిదర్శనమన్నారు. అయినా, రైతు ఉద్యమం ఏమైనా ఆగిందా? అని నిలదీశారు. సంయుక్త కిసాన్ మోర్చ నిర్వాహకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని హన్నన్ మొల్లా తప్పుబట్టారు. ఆ కేసులను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాలను వెనక్కి తీసుకునేదాకా తాము హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కిసాన్ మహా పంచాయతీలు నిర్వహిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
కేంద్రం ప్రకటనపై రైతు సంఘాల నేతల ఆగ్రహం
సాగు చట్టాలపై రైతులు చేస్తున్న పోరాటాన్ని ప్రధాని మోడీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తక్కువ చేసే విధంగా ప్రకటనలు చేయడం తీవ్ర అభ్యంతకరమని సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్కేయూ) విమర్శించింది. రైతు చట్టాలపై అన్నదాతలు ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనల సంబంధిత అంశాలను పరిష్కరించకుండా చట్టాలను గొప్పగా చెప్పడం ఏంటని నిలదీసింది. తాము చేస్తున్న ఉద్యమం జాతీయంగా... అంతర్జాతీయం ఖ్యాతి గడించిన విషయాన్ని గుర్తు చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి రైతులు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేసింది.
ఘాజీపూర్ సరిహద్దు మరోసారి బంద్
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో గల ఘాజీపూర్ సరిహద్దును మరోసారి పోలీసులు మూసివేశారు. రైతులు ఢిల్లీ ప్రాంతంలోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉందని సరిహద్దులో బారికేడ్లు వేసి మూసివేసినట్టు చెప్పారు. దీంతో ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. కాగా, భారత గణతంత్ర దినోత్సవం రోజు నుంచి ఈ దారిలో ఆంక్షలు మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే.
కాగా, ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు ఘాజీపూర్, పల్వాల్, ఢిల్లీ-హర్యానా-రాజస్థాన్ సరిహద్దు ప్రాంతం షాజహాన్పూర్లో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 97వ రోజుకు చేరింది.