Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షోభంలో రోజువారీ కార్మికుల బతుకులు
- పెరిగిన కుటుంబ ఖర్చులు.. తగ్గిన ఉపాధి.. వేతనాలు
- ప్రభుత్వ సాయం శూన్యం
సరైన ప్రణాళిక లేకుండా మోడీ తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం ఇప్పటికీ దేశాన్ని కోలుకోనీయటంలేదు. అడ్డుఅదుపులేకుండా పెంచేస్తున్న ఇంధన,గ్యాస్ ధరలకు తగ్గట్టుగా వేతనాల్లేవు. ఓ వైపు తగ్గిన ఉపాధి..పెరిగిన ఇంటి ఖర్చుల దెబ్బకు అసంఘటిత రంగ కార్మికుల బతుకులు అల్లాడిపోతున్నాయి. కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం పేదలదరికి చేరలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పూటగడవటమే కష్టంగా మారిందని రోజువారీ పనిచేసుకుంటూ బతికే కుటుంబాలు ఆవేదనవ్యక్తం చేస్తున్నాయి. మజ్దూర్ మండి సర్వేలో కార్మికుల బతుకుల కష్టాలు వెల్లడయ్యాయి.
న్యూఢిల్లీ : కరోనాకు ముందు..కరోనా తర్వాత అసంఘటితరంగ కార్మికులు పస్తులతో కాలంగడుపుతున్నారు. కాలే కడుపులను కన్నీళ్లతో నింపుకుంటున్నారని తాజా అధ్యయనంలో తేలింది. ''కరోనా లాక్డౌన్ సమయం నుంచి స్థానిక కార్మిక మార్కెట్లలో ఉపాధి లభించడం లేదు. వారానికి రెండు రోజులు కూడా పని పొందటం కష్టంగా మారింది. పని దొరికినా వేతనం లభించేది ఇదివరకటితో పోలిస్తే సగమే. ఉపాధి పోషణ మరింత భారంగా మారింది'' ఇది ఉత్తరప్రదేశ్లో రోజువారి వేతన జీవి రాజేష్ సింగ్ ప్రస్తుత పరిస్థితి. ఆయనే కాదు దేశవ్యాప్తంగా రోజువారీ వేతన కార్మికులు (అసంఘటిత రంగ కార్మికులు) పరిస్థితులు ఇలాగే ఉన్నాయని తాజాగా ''మజ్దూర్ మండి'' సర్వేలో వెల్లడైంది. కరోనా అనంతరం నుంచి దేశంలోని అసంఘటిత రంగం కార్మికులు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. వారికి ఉపాధి లభించడమే కష్టంగా మారింది. వేతనాలు సైతం ఇదివరకటి కంటే సగానికి తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వారికి అందే ప్రభుత్వ సాయం శూన్యమేనని పేర్కొంది. ఇలాంటి పరిస్థితులు దేశ ఆర్థిక విపత్తు స్వభావాన్ని.. రూపాన్ని ప్రతిబింబిస్తోంది.
కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ నుంచి రోజువారి వేతన జీవుల పరిస్థితి మరింత దారుణంగా దిగజారింది. ఆగస్టు నుంచి పలు ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించినప్పటికీ పరిమిత ఉద్యోగ అవకాశాలు, ప్రయాణ ఆంక్షలు, ప్రభుత్వ సహాయ చర్యలు సరిగ్గా అమలు చేయకపోవడంతో రోజువారి శ్రామిక వేతన జీవులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓపీ.జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ చేపట్టిన సర్వేలో దేశంలోని పెద్ద మార్కెట్లు కలిగిన లక్నో (యూపీ), సూరత్ (గుజరాత్), పూణే (మహారాష్ట్ర) వంటి ప్రాంతాలతో పాటు పలు రాష్ట్రాల్లోనూ ఆర్థిక పరిస్థితి రోజవారీ వేతన జీవుల ఆదాయాలను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. అలాగే, ఉపాధి అవకాశాలు సైతం దెబ్బతిన్నాయి. దీంతో వారు కుటుంబ పోషణకు అధిక రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. లక్నోకు సంబంధించిన డేటా ప్రకారం.. వేతన జీవుల సగటు నెలవారీ ఆదాయం 62 శాతం తగ్గింది. మహమ్మారికి ముందు రూ.9500 ఉండగా.. ఇప్పుడు రూ.3500లకు తగ్గింది. పూణేలో ఇది రూ.10 వేల నుంచి రూ.4500 పడిపోయింది. దేశంలోని పలు నగరాల్లో ఇదే విధంగా ఉన్నాయి.
తగ్గిన వేతనాలు..
రోజువారీ కార్మికుల వేతనాలు గణనీయంగా పడిపోయాయి. లక్నోలో సగటు వేతనాలు రూ.430 నుంచి రూ.360 తగ్గాయి. పూణేలో రూ.450 నుంచి రూ.390కి పడిపోయాయి. వేతన రేటును ప్రభావితం చేసే అంశాలు చాలానే ఉన్నాయి. ఏ పని చేస్తున్నారు, ఆ పనిలో ఆ కార్మికుడికి ఉన్న అనుభవం, ఏ రాష్ట్రానికి చెందినవాడు సహా లింగభేధం కూడా చూస్తున్నారు. అదే నగరంలో 10 సంవత్సరాల నుంచి పనిచేసే వారు వేతనాలు పెంచమని బేరసారాలు జరపగల్గుతున్నారు.
మిగతవారు చెప్పింది వినాల్సిందే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి కరోనా సోకుతుందనే నెపంతో ఒత్తిడి చేసి వేతనాలు తగ్గిస్తున్నారు. చాలా చోట్ల రూ.200-300లకు తగ్గాయి. కరోనాకు ముందు భవన నిర్మాణ కార్మికులకు రోజుకు సగటున రూ.400-500, చిత్రకారులకు రూ.700-800 లభించేవి. ప్రస్తుతం దీనికి విరుద్ధంగా స్పల్వంగా వేతనాలు లభిస్తున్నాయి.
పెరిగిన కుటుంబ వ్యయం..
డేటా ప్రకారం కుటుంబ వ్యయాలు సైతం రూ.5000 అధికమయ్యాయి. ఇందులో రుణాల వడ్డీ సంబంధిత చెల్లింపులు, అద్దె, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, పిల్లల విద్య, రవాణా ఖర్చులు ఉన్నాయి. ఇందులో విద్యా వ్యయాలు గణనీయంగా తగ్గటం ఆందోళన కలిగించే అంశంగా ఉంది. చాలా మంది విద్యార్థులు ఆన్లైన్ విద్యను పొందలేకపోయారు. ఆయా కుటుంబాల రవాణా ఖర్చులు సైతం పెరిగాయి. రవాణ ఖర్చులు నెలకు సగటున రూ.890 ఉండగా ప్రస్తుతం రూ.1,030 పైగా పెరిగింది. ఇది పెద్దగా కనిపించకపోయిన రోజువారీ ప్రయాణ చార్జీలు రూ.60 నుంచి రూ.100 పెరగడం గమానార్హం. ప్రభుత్వం సైతం దూర ప్రయాణాలపై ఆంక్షల కారణంగా ప్రయివేటు రవాణాకు భారీగానే ఖర్చు చేయాల్సివచ్చిందని డేటా వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ ఖర్చులు సైతం నెలకు సగటున రూ.1900 నుంచి రూ.4700కు పెరిగాయి.