Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : '' వంద ఎలుకల్ని తీసుకొచ్చి ...ఒక గుర్రాన్ని తయారుచేయలేం. అలాగే వంద అనుమానాల్ని ముందుపెట్టుకొని ఒక సాక్ష్యాన్ని రూపొందించలే ''మన్న ఒక రష్యన్ నవలా రచయిత మాటల్ని ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఢిల్లీ అల్లర్ల కేసును విచారణ చేస్తున్న 'క్రైం, పనిష్మెంట్' అడిషనల్ సెషన్స్ జడ్జ్ అమితాబ్ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై పోలీసులు నమోదుచేసిన హత్య నేరారోపణల్ని న్యాయమూర్తి కొట్టేశారు. '' ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని నిర్దోషులుగా తేల్చుతూ విడుదల చేస్తున్నాం. వీరిపై ఐపీసీ సెక్షన్ 307, ఆయుధాల చట్టం కింద నమోదైన ఆరోపణలు రుజువు కాలేదు. కేవలం అనుమానాల్ని సాక్ష్యాలుగా తీసుకొని శిక్ష వేస్తామా?'' అని న్యాయమూర్తి ప్రశ్నించారు. నేరారోపణల విషయమై మాట్లాడుతూ నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి భౌతికమైన ఆధారాలు లేవని అన్నారు. నిందితులపై ముందస్తుగా ఏర్పరచుకున్న ఒక అభిప్రాయం, ముద్ర...దానినే ఒక సాక్ష్యంగా, ఆధారంగా తీసుకోలేమని చెప్పారు.
ఇంతకీ కేసేంటి ?
ఈశాన్య ఢిల్లీలో ఫిబ్రవరి 25, 2020లో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. మౌజాపూర్ ప్రాంతంలో ఎవరూ గుమికూడరాదని పోలీసులు 144 సెక్షన్ విధించారు. అయినప్పటికి బాబు, ఇమ్రాన్ అనే ఇద్దరు వ్యక్తులు అల్లర్లకు, దాడులకు దిగారని, కాల్పులకు తెగబడ్డారని పోలీసులు ఆరోపణలు నమోదుచేశారు. కాల్పుల వల్ల గాయాలపాలైన రాహుల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఆరోపణలు నమోదుచేశామని పోలీసులు కోర్టులో తెలిపారు. అయితే రాహుల్ తప్పుడు చిరునామా, మొబైల్ ఫోన్ నెంబర్ ఇచ్చాడని కోర్టు గుర్తించి ప్రశ్నించింది. అసలు రాహుల్ నుంచి వాంగ్మూలం స్వీకరించకుండానే బాబు, ఇమ్రాన్లపై పోలీసులు 307 కేసు ఎలా పెడతారని కోర్టు ప్రశ్నించింది.