Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసాధారణ వాతావరణ పరిస్థితుల ప్రభావం
- ఒక్క ఎస్బీఐ పైనే రూ. 3.83 లక్షల కోట్ల ప్రభావం
న్యూఢిల్లీ : దేశంలోని అగ్రశ్రేణి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రుణ ఎగవేతదారుల నుంచే కాదు.. ప్రకృతి నుంచీ కష్టాలు తప్పడం లేదు. తుఫాన్లు, వరదలు, కరువు వంటి పెరుగుతున్న అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా బ్యాంకులను మరింత అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉన్నది. వీటి కారణంగా అగ్రశ్రేణి బ్యాంకులపై రూ. 6.19 లక్షల కోట్ల రుణ భారం పడే అవకాశం ఉన్నది. సీడీపీ అనే పర్యావరణ స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనంలో భాగంగా మొత్తంగా రూ. 77.44 కోట్ల కోట్ల (106 లక్షల కోట్ల డాలర్లు) మేర ఆస్థులున్న 515 సంస్థల అభిప్రాయాలను సీడీపీ కోరింది. ఇందులో 220 చిన్నా, పెద్ద సంస్థలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. అందులో 67 బ్యాంకులున్నాయి. ఈ నివేదిక వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ఎస్పీఐతో పాటు హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, యస్ బ్యాంక్ వంటి వాటికే సుమారు రూ. 6.19 లక్షల కోట్ల మేర నష్టాలు వస్తాయి. ఒక్క, ఎస్పీఐకే అధికంగా రూ. 3.83 లక్షల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నది. ఇక ఎస్బీఐ తర్వాత అత్యంత ఎక్కువగా నష్టపోయే జాబితాలో ఉన్నది హెచ్డీఎఫ్సీ. ప్రకృతి విపత్తుల కారణంగా దాదాపు రూ. 1.79 లక్షల కోట్ల నష్టం ఉండొచ్చని సీడీపీకి సదరు బ్యాంకు వెల్లడించింది. ఇక ఇండస్ ఇండ్కు రూ. 46వేల కోట్లు, యాక్సిస్కు రూ. 7,500 కోట్లు, యస్ బ్యాంకుకు రూ. 2వేల కోట్ల మేర నష్టాలు వస్తాయని సీడీపీ నివేదిక పేర్కొన్నది. అయితే, సిమెంట్, బొగ్గు, చమురు, విద్యుత్ వంటి పర్యావరణ సున్నితమైన ప్రాజెక్టుల కారణంగానే బ్యాంకులకు ఎక్కువ నష్టం కలుగుతుందని సీడీపీ నివేదిక పేర్కొన్నది. ఇదే విషయాన్ని సీడీపీతో ఎస్బీఐ తన అభిప్రాయాన్ని పంచుకోవడం గమనార్హం.