Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : అన్నదాతల పోరాటానికి సామాజిక మాధ్యమాల్లో మద్దతు తెలియజేసిన మేధావులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలపై మోడీ సర్కార్ వేధింపులు కొనసాగుతూ నేవున్నాయి. తాజాగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారంటూ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, నటి తాప్పీ ఇండ్లపై ఆదాయ శాఖ (ఐటి) అధికారులు దాడులు జరిపారు. ముంబయి, పూణెల్లో సుమారు 20 ప్రాంతాల్లో సోదాలు జరిపినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఫాంటమ్ ఫిల్మ్ సంస్థతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించారు. కాగా, ఫాంటమ్ ఫిల్మ్ సంస్థకు అనురాగ్ కశ్యప్తో పాటు వికాస్ బహల్, మధు మంతెనా సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దాడుల విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాకు తెలియజేశారు.
ఐటీ అధికారులు దాడులు జరిపారని, అనంతరం కోర్టుకు నివేదిక సమర్పిస్తారని ఆయన చెప్పారు. రైతు వ్యతిరేక చట్టాల విషయంలో అనురాగ్ కశ్యప్, తాప్సీ కేంద్ర సర్కార్ తీరుపై బహిరంగంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో వారు ప్రచారం చేశారు. ఇటీవల రైతుల నిరసనకు మద్దతు తెలిపిన పాప్ స్టార్ రిహన్నాపై ప్రభుత్వ ప్రతిస్పందనకు పలువురు ప్రముఖులు సంఘీభావం ప్రకటించడాన్ని కూడా తాప్పీ ఖండించారు. 2019లో సిఎఎ ఆందోళనకారులపై జరిపిన హింసాకాండను అనురాగ్ కశ్యప్ ఖండించారు. అలాగే జెఎన్యు విద్యార్థులపై దాడికి నిరసనగా జరిగిన ఆందోళనలకు కూడా వీరు మద్దతు ప్రకటించారు.