Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యా సంవత్సరంలో మూడో వంతు కోల్పోయిన చిన్నారులు
- 'సేవ్ ది చిల్డ్రన్' నివేదిక
న్యూఢిల్లీ : కరోనా తెచ్చిన కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు కూడా బాధితులుగా మిగిలారు. మహమ్మారి కారణంగా వారి విలువైన విద్యాసంవత్సరానికి అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక విద్యాసంవత్సరం (190 పని దినాలలో)లో సగటున 74 రోజులు చిన్నారులు బడికి దూరమయ్యారు. ఈ విషయాన్ని 'సేవ్ ది చిల్డ్రన్' అనే చిన్నారుల హక్కుల కోసం పని చేసే ఒక ఎన్జీవో తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికలో భాగంగా 194 దేశాలకు చెందిన సమాచారాన్ని విశ్లేషించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పేద విద్యార్థులు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నారని నివేదిక పేర్కొన్నది. పశ్చిమ యూరప్ చిన్నారుల విద్యలో.. లాటిన్ అమెరికా, కరేబియన్, దక్షిణాసియాకు చెందిన చిన్నారులు మూడు రెట్ల చదువును కోల్పోయారని నివేదిక వివరించింది.
లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాలకు చెందిన చిన్నారులు 110 రోజులు ఎలాంటి విద్యా లేకుండానే గడిపారు. ఇక మధ్యప్రాశ్చంలో ఈ సంఖ్య 80 రోజులుగా, ఉప-సహారా ఆఫ్రికాలో ఇది 69 రోజులుగా ఉన్నదని తేలింది. తూర్పు ఆసియా, పసిఫిక్ ప్రాంత దేశాల్లోని చిన్నారులు సగటున 47 రోజులు విద్యకు దూరమయ్యారు. యూరప్, మధ్య ఆసియా చిన్నారులు సగటున 45 రోజులు, పశ్చిమ యూరప్ చిన్నారులు 38 రోజులు బడి బాట పట్టలేకపోయారు.
ఇక కరోనా తమ జీవితాల్లోకి ప్రవేశించడం, అనిశ్చితికి సంబంధించి భారత్లోని చిన్నారులు చాలా ఒత్తిడికి లోనయ్యారని సదరు ఎన్జీవో తెలిపింది. మహమ్మారి వ్యాప్తి జరిగిన సమయం నుంచి ప్రతి నలుగురు చిన్నారుల్లోని ముగ్గురిలో ప్రతికూల భావనలు పెరిగాయని తేలింది. బడికి తిరిగి వెళ్లే విషయం, ఉపాధ్యాయులు, స్నేహితులతో కలవలేకపోవడం, కుటుంబాల్లో వ్యక్తులు భౌతికంగా దూరం కావడం కారణంగా దారి తీసే అభద్రత, ఇండ్లలో సంబంధాలు చెడిపోవడంతో దారి తీసే హింస వంటివి ఇందులో అంశాలుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల మంది బాలికలను బాల్య వివాహాలకు దారి తీసే ప్రమాదం ఉన్నదని నివేదిక అంచనా వేసింది. మరోపక్క, పాఠశాలల మూసివేత కారణంగా ఆన్లైన్ పాఠాలు చిన్నారులందరికీ సమానంగా అందలేదనీ, ఈ విషయంలో దేశంలోని ఒక ప్రాంత ప్రజల్లోనే తీవ్ర అంతరాయాలున్నాయని నివేదిక గుర్తించింది. చిన్నారులను తిరిగి సురక్షితంగా పాఠశాలలకు పంపించకపోతే మనమంతా కరోనా పోరాటంలో ఓడిపోయే ప్రమాదం ఉన్నదని భారత్లోని సేవ్ ది చిల్డ్రన్ సీఈఓ సుదర్శన్ హెచ్చరించారు.