Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీఐ దళిత కార్యకర్త దారుణ హత్య
- కర్రలతో, ఇనుపరాడ్లతో పోలీసుల ముందే పెత్తందారుల దాడి
అహ్మదాబాద్: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కార్యకర్త అమ్రాభారు బొరీచాను ఉన్నత కులస్థులు ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేసి ప్రాణాలు తీసిన దారుణ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై ఒక ఎఫ్ఐఆర్ నమోదుకాగా, పోలీసులపై కూడా మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వివరాల్లోకెళ్తే.. ''ఆర్టీఐ కార్యకర్త అమ్రాభారు బొరీచా ఇంటి ముందు నుంచి అగ్ర కులాలకు చెందిన 50 మందితో కూడిన బృందం పాటలు పాడుతూ ఊరేగింపుగా వెళ్లింది. ఈ క్రమంలోనే ఆ బృందంలోని పలువురు తిరిగొచ్చి తమపై దాడికి తెగబడ్డారనీ, తప్పించుకోవడానికి ఇంటిలోకి వెళ్లిన గేట్లను పగలగొట్టుకుని తన తండ్రిపై దాడి చేశారని'' బొరిచా కుమార్తె వెల్లడించింది. అత్యంత దారుణంగా ఇనుపరాడ్లు, కర్రలతో తన తండ్రిని కొట్టిచంపారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, బొరీచాకు ప్రాణహాని ఉందని తెలిసి ఆయనకు ఇద్దరు పోలీసులతో అధికారులు భద్రత కల్పించారు. అయిన్నప్పటికీ వారిముందే ఆయనపై దాడికి తెగబడ్డారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ఘటనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదుచేసినట్టు తెలిపారు. అందులో హత్యతో పాటు పలు ఇతర అభియోగాలు మోపుతూ 10 మందిపై కేసు నమోదుచేశారు. అలాగే, ఘోఘా పోలీసు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పిఆర్.సోలంకి పై కూడా ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు వెల్లడించారు. బొరీచా ప్రాణాలకు ముప్పుపై బాధితుల ఆందోళనలను పట్టించుకోవడం లేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.