Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళనలకు పిలుపు : సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ఎస్కేయూ సంయుక్త ప్రకటన
- 98వ రోజుకు చేరిన దేశవ్యాప్త రైతు ఆందోళనలు
నవతెలంగాణ - న్యూఢిల్లీ బ్యూరో
కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రయివేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా మార్చి 15న 'యాంటీ ప్రయివేటైజేషన్ డే' పేరుతో దేశశ్యాప్తంగా భారీ ఆందోళనలు నిర్వహించాలని కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ అధికార భవనాల ముందు శాంతియుత నిరసనలు తెలపాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆ రెండు సంఘాలు గురువారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. మార్చి 16, 17, 18 తేదీల్లో ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఎంప్లాయీస్ సంఘాలు పిలుపునిచ్చిన సమ్మెకు సంఘీభావం తెలుపుతున్నట్టు స్పష్టం చేశాయి. కాగా, మార్చి 6వ తేదీకి రైతాంగ పోరాటం 100 రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోని కుండ్లి-మనేసర్-పల్వాల్(కేఎంసీ) ఎక్స్ప్రెస్ వేను పూర్తిగా దిగ్భంధనం చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రోడ్ బ్లాక్ నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దాంతోపాటు, దేశవ్యాప్తంగా రైతులంతా రైతులంతా ఇంటివద్ద నల్ల జెండాలు ఎగురవేయాలని సూచించాయి. 5న కర్నాటకలో ఎంఎస్పీ దిలావ్ పేరుతో ఉద్యమం చేస్తామన్నాయి.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దీక్షా స్థలాల్లో మహిళలు ఉద్యమం జరుగుతుందని రైతు సంఘాలు తెలిపాయి. 10 నుంచి 15 తేదీ వరకు కార్మికులు, ఉద్యోగులు ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని నిర్ణయించాయి. మోడీ సర్కారు ఈ చట్టాలను రద్దు చేసేదాకా ఉద్యమం విరమించేది లేదని సంయుక్త కిసాన్ మోర్చ సమమన్వయకర్త దర్శన్ పాల్ హెచ్చరించారు. దాంతోపాటు, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతత్వంలోని మోడీ సర్కారు అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన సాగు వ్యతిరేక చట్టాల మీద అన్నదాతలు చేస్తున్న దేశవ్యాప్త ఉద్యమంపై ఎన్డీఏ ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు కసరత్తులు ప్రారంభించిందన్నారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో తమ బృందం పర్యటిస్తుందని వివరించారు. రాష్ట్రాల స్థానిక రైతులను విజ్ఞప్తి చేయడానికి దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఎస్కేయూ తన నాయకులను పంపుతుందన్నారు. రైతు చట్టాలకి వ్యతిరేకంగా పోరాడుతున్న వారిని ఢిల్లీ పోలీసులు బెదిరించడం, వేధించే ధోరణి అవలంభిస్తే అన్నదాతల పోరాటం ఎంతమాత్రం ఆగదని స్పష్టం చేశారు. ఆందోళన కార్యాచరణకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాల్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సంయుక్త కిసాన్ మోర్చ(ఎస్కేయూ), తదితర సంఘాలు ఉన్నట్టు దర్శన్ పాల్ మీడియాకి తెలిపారు.
దేశవ్యాప్తంగా 98వ రోజున కొనసాగిన
అన్నదాతల ఆందోళన
మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు ఘాజీపూర్, పల్వాల్, ఢిల్లీ-హర్యానా-రాజస్థాన్ సరిహద్దు ప్రాంతం షాజహాన్పూర్ లో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళనలు గురువారంతో 98 రోజుకు చేరింది.
బీజేపీని రాజకీయంగా ఓడిస్తినే రైతులు, కార్మికులకు శ్రేయోస్కరం : ప్రదీప్ ముడ్డా, రైతు
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో రాజకీయంగా ఓడిస్తినే దేశంలోని రైతులు, కార్మికులకు శ్రేయస్కరమని ఘాజీపూర్లో ఉద్యమిస్తున్న రైతు ప్రదీప్ ముడ్డా పేర్కొన్నారు. తాము చలి, ఎండలో కూడా రోడ్డుపై కూర్చొని ఉద్యమం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదన్నారు. రైతులు, కార్మికులపై ఇంతస్థాయిలో అహంకారం చూపించిన ప్రభుత్వాలను తాను చరిత్రలో చూడలేదని స్పష్టం చేశారు. తాము గత యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి తప్పుచేశామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.