Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'పాక్షిక స్థితికి' చేరిన వైనం
- మోడీ వచ్చాక దిగజారిన రాజకీయ హక్కులు, పౌర స్వేచ్ఛ
- 'ఫ్రీడం ఇన్ ది వల్డ్ 2021' నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారత్లో 'స్వేచ్ఛ'కు స్థానం కుంచించుకుపోతున్నది. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ స్థానం క్రమక్రమంగా పడిపోతున్నది. తాజాగా యూఎస్ కేంద్రంగా పనిచేసే లాభాపేక్ష లేని ఫ్రీడం హౌజ్ సంస్థ తన వార్షిక నివేదిక అయిన 'ఫ్రీడం ఇన్ ది వల్డ్ 2021' లో ఇదే విషయాన్ని పేర్కొన్నది. భారత్లో 'స్వేచ్ఛ'.. 'పాక్షిక స్వేచ్ఛ' స్థాయికి దిగజారిందని ఇది వెల్లడించింది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి తీవ్రమైందని వివరించింది. ఇప్పటికే అనేక ప్రపంచ నివేదికలు సైతం భారత్లో స్వేచ్ఛ తగ్గిపోతోందంటూ వెల్లడించిన విషయం విదితమే.
తాజా నివేదిక వెల్లడించిన విషయాల ప్రకారం.. దేశంలో రాజకీయ హక్కులు, పౌర స్వేచ్ఛ తగ్గిపోయాయి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిల్లో దాని భాగస్వామ్యాలు తమపై వచ్చే విమర్శలు, అసమ్మతిని తొక్కిపెట్టే ప్రయత్నాలను కొనసాగించాయి. '' 2014 కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో రాజకీయ హక్కులు, పౌరుల స్వేచ్ఛ దిగజారిపోయింది. మానవ హక్కుల సంస్థలపై ఒత్తిడి పెరిగింది. జర్నలిస్టులు, విద్యావేత్తలపై బెదిరింపులు పెరిగాయి. దేశంలో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటూ భౌతిక దాడులు, మూకదాడులు పెరిగాయి'' అని నివేదికలో పేర్కొన్నారు. 2019లో మోడీ రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత ఊపందుకున్నదని తేల్చింది.
కాగా, 'స్వేచ్ఛ'కు సంబంధించిన విషయంలో 'ఫ్రీడం హౌజ్'.. భారత్కు 100 మార్కులకు గానూ 67 మార్కులను ఇచ్చింది. ఇది గతేడాది 71గా ఉన్నది. ఇక రాజకీయ హక్కులకు సంబంధించి 40 మార్కులకు గానూ 34, పౌర స్వేచ్ఛకు సంబంధించి 60కి గానూ 33 మార్కులను కేటాయించింది. '' అగ్రస్థానాల స్వేచ్ఛ దేశాలు'' నుంచి భారత స్థాయి పడిపోవడం.. అంతర్జాతీయ ప్రజాస్వామిక ప్రమాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని నివేదిక వివరించింది.
ఇక కోవిడ్ విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం, రాష్ట్రాల్లోని దాని భాగస్వామ్యపక్షాలు వ్యవహరించిన తీరు దేశంలోని లక్షలాది మంది వలసకార్మికులను ప్రమాదంలోకి నెట్టిపడేశాయి. కార్మికులందరూ తమ స్వస్థలాలకు ఎలాంటి ప్రణాళిక లేకుండానే వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక కాశ్మీర్లో మాత్రం '' స్వేచ్ఛ లేదు'' అని నివేదిక వివరించింది.
అధికార హిందూ జాతీయవాద రాజకీయాల కారణంగా దేశంలోని ఒక వర్గం వారు బలిపశువులయ్యా రనీ, కరోనా సమయంలో ఆ వ్యాధి వ్యాప్తికి కారణమ య్యారన్న ఆరోపణలతో వారిపై దాడులు జరిగాయని వెల్లడించింది. మోడీతో పాటు ఆయన పార్టీ దేశాన్ని అధికార వాదం వైపు విషాదకరంగా నడిపిస్తున్నాయి. ప్రపంచ ప్రజా స్వామ్య నాయకుడిగా పనిచేసే సామర్థ్యాన్ని వదిలిపెట్టి.. ఇరుకైన హిందూ జాతీయవాద ప్రయోజనాలతో మోడీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని వివరించింది. హిందూ మహిళలకు రక్షణ పేరుతో ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు 'లవ్ జిహాద్' చట్టాలను తీసుకువచ్చాయనీ ఈ సందర్భంగా పలువురు రాజకీయ నిపుణులు విశ్లేషించారు. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, యూపీలు 'లవ్ జిహాద్' చట్టాలను తయారు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో హర్యానా ప్రభుత్వం చట్టం తయారీ కోసం ముగ్గురు సభ్యులతో డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక కర్నాటక, అసోం లలోని బీజేపీ పాలిత ప్రభుత్వాలు కూడా ఇప్పటికే ఇలాంటి ప్రకటనలు చేయడం గమనార్హం.