Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కాలంలో రూ.13 లక్షల కోట్లు
- డిమాండ్లో స్తబ్దత కొనసాగొచ్చు
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం, ఉద్యోగాలు కోల్పోవడం వల్ల దేశంలో కుటుంబాల ఆదాయం భారీగా పడిపోయిందని ఓ రిపోర్ట్లో వెల్లడయ్యింది. కరోనా ప్రారంభం నుంచి దాదాపుగా రూ.13 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోయారని యుబిఎస్ సెక్యూరిటీస్ ఇండియా ఓ రిపోర్ట్లో తెలిపింది. ఈ పరిస్థితి 2021 మధ్యస్థ కాలం వరకు కొనసాగవచ్చని.. దీంతో వినిమయ డిమాండ్లో తగ్గుదల ఉండొచ్చని విశ్లేషించింది.
గత కొన్ని నెలలుగా ఆర్థిక వ్యవస్థ రికవరీలో ఉన్నప్పటికీ వినిమయంలో స్తబ్దత కొనసాగనుందని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు, మూడు త్రైమాసికాల్లో వృద్ధి సానుకూలంగా నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని యుబిఎస్ సెక్యూరిటీస్ ఇండియా నిపుణులు తాన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. 2021 మధ్యస్థ కాలం వరకూ ఆర్థిక వ్యవస్థ స్తబ్దతగానే ఉండొచ్చన్నారు. కరోనా కాలంలో ప్రజలు రూ.13 లక్షల కోట్ల ఆదాయం కోల్పోవడంతో ఆ ప్రభావం రానున్న కొన్ని నెలలపై కూడా పడనుందన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో జిడిపి ఏకంగా 24 శాతం మేర క్షీణించింది. ఆ తర్వాతి సెప్టెంబర్ త్రైమాసికంలో 7.5 శాతం మేర పడిపోయింది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో మాత్రం స్వల్పంగా పెరిగింది. వరుస త్రైమాసికాలుగా పుంజుకుంటున్నప్పటికీ భవిష్యత్తు వృద్థి మాత్రం నూతన పెట్టుబడులు, విత్త సంస్థలపై ఒత్తిడి తగ్గడంపై ఆధారపడి ఉందని ఈ రిపోర్ట్ పేర్కొంది. ''కరోనాకు ముందు స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయి. మార్చి త్రైమాసికంలో కూడా సానుకూల వృద్థి చోటు చేసుకోనుంది. అయితే వృద్థి రేటు ఏ స్థాయిలో కొనసాగుతుందో లేదో వేచి చూడాలి'' అని పేర్కొంది. దేశంలో గృహ రుణాలపై తగ్గిన వడ్డీ రేట్లు రియాల్టీ రంగానికి మద్దతును ఇవ్వొచ్చని తెలిపింది. 2020లో గృహ అమ్మకాల్లో 31 శాతం తగ్గుదల చోటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసింది.