Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బార్ కౌన్సిల్ తీరును ప్రశ్నించిన బృందాకరత్
న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కు తాను రాసిన లేఖపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) స్పందించిన తీరుపై సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ బార్ కౌన్సిల్కు మరో లేఖ రాశారు. సీజేఐకి తాను లేఖ రాయడం, దాని గురించి మీడియాలో వార్తలు రావడాన్ని తీవ్రమైన ధిక్కారచర్యలుగా బార్ కౌన్సిల్ అభివర్ణించింది. ఇటువంటి హానికరమైన దాడులను నిలువరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందని పేర్కొంటూ బార్ కౌన్సిల్ తీర్మానించింది. తన లేఖ గానీ, అది మీడియాలో రావడంలో గానీ ఎలాంటి ధిక్కారణ లేదా హానీ లేదని బృందాకరత్ ఆ లేఖలో స్పష్టం చేశారు. పైగా ఇందుకు విరుద్ధంగా కౌన్సిల్ తన తీర్మానంలో ఉపయోగించిన కొన్ని పదాలు బెదిరింపుగా తీసుకోవాల్సి వుంటుందని బృందాకరత్ పేర్కొన్నారు. సీజేఐకి రాసిన లేఖలోని అంశాలకు తాను కట్టుబడి వున్నానని ఆమె పునరుద్ఘాటించారు. ఈ నెల 4వ తేదిన బార్కౌన్సిల్ ఆమోదించిన తీర్మానంలో తనపై చేసిన కొన్ని వ్యక్తిగత ఆరోపణలకు తాను స్పందించబోనని అన్నారు. అయితే ఆ తీర్మానంలో పలుచోట్ల అప్రతిష్టకరమైన రీతిలో తన పేరు ప్రస్తావించినందుకు తాను ఇప్పుడు ఇలా స్పందిస్తున్నానని అన్నారు. వారు ఆ తీర్మానంలో లెవనెత్తిన అంశాలు న్యాయం కోసం జరిపే పోరాటంపై తీవ్ర పర్యవసానాలు చూపుతాయని అన్నారు. సమాజంలో అణచివేతకు గురయ్యే వర్గాల తరపున మహిళల హక్కులు, న్యాయం కోసం పోరాటం జరిపే తనకు ఇవి మాట్లాడే హక్కు వుందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక చట్టబద్ధమైన సంస్థగా బార్ కౌన్సిల్ పాత్రను పరిశీలించాల్సి వుందని అన్నారు.
లైంగికదాడికి గురైన బాధితురాలిని పెండ్లి చేసుకుంటావా?.. అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీర్పులో భాగంగా వున్నాయా లేదా అనేది ఇక్కడ అప్రస్తుతం. కానీ, ఇటువంటి వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదని బృందాకరత్ స్పష్టం చేశారు. న్యాయమూర్తులు చేసే ఇటువంటి వ్యాఖ్యలకు ఎలాంటి చట్టబద్ధత వుండదనీ, అటువంటపుడు వీటిపై ఎందుకు ఇంత గొడవ చేస్తారని బార్ కౌన్సిల్ తన తీర్మానంలో ప్రశ్నించింది. కానీ ప్రస్తుత కేసులో విచారణ సందర్భంగా ఉన్నతాధికారులు చేసే ఇటువంటి వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం కలిగిస్తాయనీ, పైగా ఆ నేరం నీరుగారిపోవడానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలకు చట్టబద్ధత వుండకపోవచ్చు కానీ సామాజిక విధానాలు, ధోరణులను తిరోగమింపచేయడానికి కావాల్సిన అవకాశాన్ని ఇస్తాయని ఆమె పేర్కొన్నారు. బార్ కౌన్సిల్ నిజంగా దీనిపై స్పందించాలనుకుంటే అత్యుత్తమ న్యాయ పద్ధతులను, ప్రమాణాలను పాటించాలనీ, ఇటువంటి వ్యాఖ్యల ప్రతికూల ప్రభావాలను సంబంధిత కోర్టుతో చర్చించాలని బృందా సూచించారు.
రేపిస్ట్ తల్లిదండ్రులకు, మైనర్ బాలికకు మధ్య జరిగిన రాతపూర్వక ఒప్పందం గురించి బార్ కౌన్సిల్ తీర్మానం పేర్కొంటోంది. అసలు ఇటువంటి ఒప్పందానికి చట్టబద్ధత వుందా? ఆ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించిందని బార్ కౌన్సిల్కు తెలుసా? వివాహం చేసుకోవాలన్న ప్రతిపాదనను ఆమె తిరస్కరించిందని తెలుసా? పైగా ఈ కేసులో ఆమె మైనరని ఆమె తరపున ఈ ఒప్పందం చేశారు, కానీ ఆమె మేజర్ అయితే రేపిస్ట్ను అడగడానికి ముందే ఆమెను ఈ విషయంపై ప్రశ్నించాల్సిన బాధ్యత కోర్టుకు లేదా? ఈ మొత్తం వ్యవహారంలో మైనర్ బాధితురాలికి ఏం జరిగినా దాని గురించి పట్టించుకునే పరిస్థితి బార్ కౌన్సిల్కు వున్నట్టు కనిపించడం లేదని బృందాకరత్ తెలిపారు.
ఈ మొత్తం న్యాయక్రమంలో నిందితుడి తరపు కాకుండా బాధితురాలి ప్రయోజనాలు కీలకంగా భావిస్తూ చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి ఈ కౌన్సిల్కు పట్టకపోవడాన్ని ముందుగా పరిశీలించాల్సి వుందని అన్నారు.