Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిరసనల్లో రైతులు... పంటలను కాపాడుతున్న గ్రామస్థులు
- పంజాబ్లో ప్రతి గ్రామంలోనూ ఇదే తీరు
చండీగఢ్ : వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు కొనసాగిస్తున్న అన్నదాతలకు వారి గ్రామాలకు చెందిన ప్రజలు బాసటగా నిలుస్తున్నారు. పంటలు వేసి దీక్షల్లో పాల్గొనడానికి ఢిల్లీ సరిహద్దులకు వచ్చి అన్నదాతలు ఆందోళనలు కొనసాగిస్తుంటే.. ఊరిలోని ప్రజలు ఆ రైతులు వేసిన పంటకు రక్షణగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నారు. వివాదాస్పద చట్టాలు రద్దయ్యేంతవరకు పోరాడతామన్న రైతన్నలకు పంజాబ్లోని ప్రతి గ్రామంలోని ప్రజలు ఈ విధంగా మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు.
జగ్సీర్ సింగ్ చిన్నివాల్ అనే ఓ రైతు సంఘం నాయకుడు గతేడాది నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నూతన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాడు. అయితే, బర్నాలలోని చిన్నివాల్ గ్రామ ప్రజలు ఆయన పంటపొలాలను ఏ మాత్రం నష్టం కాకుండా చూసుకున్నారు. '' నేను ఢిల్లీ సరిహద్దుకు వచ్చే ముందు గోధుమ పంటను వేశాను. పంటను గ్రామస్థులు చక్కగా చూసుకున్నారు. ప్రతిరోజూ పంటకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వారు నాకు పంపేవారు. అయితే, పంటకోతకు సమయం వచ్చింది. అయినా ఈ విషయంలో నాకు ఏ మాత్రం బాధ లేదు. ఎందుకంటే వారు (గ్రామస్థులు) పంటకోతను చక్కగా నిర్వహించగలుగుతారు'' అని జగ్సీర్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. '' ప్రతివారం, మా గ్రామం నుంచి 17-18 మంది నిరసల్లో పాల్గొనడానికి ఢిల్లీ సరిహద్దుకు వెళ్తారు. పంటకోత అనే ప్రక్రియ రెండు నుంచి మూడువారాలకు సంబంధించింది. కాబట్టి, ఒకరి భారాన్ని మరొకరం మేము సులువుగా నిర్వహించగలం. అంతేకాదు, ఏ ఒక్కరికి నష్టం చేకూరకుండా 15-20 మంది సభ్యులుండే మా గ్రామ కమిటీ కూడా గ్రామంలో ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంది'' అని ఆయన వివరించారు.
ఢిల్లీ సరిహద్దుల్లో దీక్షలు కొనసాగిస్తూ గ్రామాల్లో పంటకోత, కోనుగోలుకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా చేపట్టాల్సిన చర్యలపై టిక్రీ సరిహద్దు వద్ద రైతులతో ఇప్పటికే చర్చించినట్టు బీకేయూ డకౌండ ఉపాధ్యక్షుడు మన్జీత్ ధనర్ తెలిపారు. ఈనెల 8న నిరసన వేదిక వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పారు. అయితే, పాల సేకరణ, పంట సేకరణ, నిల్వ, కొనుగోలు, వ్యవసాయ కార్మికులకు సంబంధించిన విషయాలు చూసుకోవాల్సిన అవసరం ఉన్నందున ఈనెల 8 తర్వాత నుంచి మహిళల సంఖ్య పరిమితంగానే ఉంటుందని వివరించారు. ఇదే విధంగా, పలు మండలాలు, గ్రామాలకు చెందిన రైతులు కూడా పంటకోత సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై, తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నారు. ఐక్యంగా ఉంటేనే ఇటు పంటకోత పనులతో పాటు అటు నిరసనలను కూడా కొనసాగించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలమని రైతన్నలు తెలిపారు. పంజాబ్ వ్యవసాయ విభాగం సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 35.05 లక్షల హెక్టార్లలో రైతులు గోధుమ పంటను వేశారు. ఏప్రిల్ నెలలో ఈ పంట కోతలు జరగనున్నాయి.