Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఐఐఎఫ్బీ ఈడీ కేసుకు సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో ఖండన
న్యూఢిల్లీ : కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల ఫండ్ బోర్డ్ (కేఐఐఎఫ్బీ)పై కేసు నమోదు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న చర్యను సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమ స్వార్ధ ప్రయోజనాలకు ఇడిని ఒక రాజకీయ సాధనంగా వినియోగించుకుంటూ దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళలో బీజేపీ ఎన్నికల సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, కెఐఐఎఫ్బిపై, ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారనీ, ఆ తర్వాతనే ఈడీ ఈ చర్య తీసుకున్నదనీ, ఇది పూర్తిగా అవాంఛనీయమైనదని పొలిట్బ్యూరో పేర్కొంది. సంస్థ ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఇడి కేసు నమోదు చేసింది. కేఐఐఎఫ్బీ సీఈఓ, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్లను విచారణకు రావాల్సిందిగా సమన్లు పంపింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంస్థపై ఇది చాలా తీవ్రమైన దాడి అని పొలిట్బ్యూరో వ్యాఖ్యానించింది. ఒక కార్పొరేట్ సంస్థగా కేఐఐఎఫ్బీకి వాణిజ్యపరమైన రుణాలను సమీకరించే హక్కు వుంది. భారత రిజర్వ్ బ్యాంక్ ఆమోదం ప్రకారమే విదేశాల్లో మసాలా బాండ్లు జారీ చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించిన అనంతరం ఇడి తీసుకున్న చర్య ఖండించదగినదని పొలిట్బ్యూరో పేర్కొంది. ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి, కేఐఐఎఫ్బీ ఆధ్వర్యంలో చేపట్టిన విస్తృతమైన అభివృద్ధి పనులకు అపఖ్యాతి కలిగించేందుకు చేసిన దారుణమైన ప్రయత్నమని విమర్శించింది. ఫెడరల్ సిద్ధాంతాన్ని ఇది తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. కేఐఐఎఫ్బీపై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని వెనక్కి తీసుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో డిమాండ్ చేసింది. సంస్థ సీనియర్ అధికారులను వేధించడాన్ని మానుకోవాలని స్పష్టం చేసింది.